సన్రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ జాక్పాట్ కొట్టేసాడు. ఐపీఎల్ 2024 సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసిన ఈ పంజాబ్ ఆటగాడు తొలిసారి టీమిండియా పిలుపు అందుకున్నాడు. వచ్చే నెల ఐదు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టులో అభిషేక్ శర్మకు చోటు దక్కే అవకాశం ఉంది.
ఈ పర్యటన నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ఆడిన సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినవ్వనున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లతో కూడిన యంగ్ టీమ్ను జింబాబ్వేకు పంపించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఐపీఎల్ 2024 సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసిన అభిషేక్ శర్మతో పాటు రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి, విజయ్కుమార్ వైశాఖ్, యశ్ దయాల్లకు కూడా టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ కుర్రాళ్లతో పాటు కాస్త సీనియర్ ఆటగాళ్లు అయిన శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్లకు కూడా జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. కొత్త కోచ్ పర్యవేక్షణలో టీమిండియా ఈ పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది.
ఇప్పటికే కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను చేపట్టిన బీసీసీఐ.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారమే క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) గంభీర్ను ఇంటర్వ్యూ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా టీమిండియా హెడ్ కోచ్ పదవికి గంభీర్ ఒక్కడే దరఖాస్తు చేసుకున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ గంభీర్ కొత్త కోచ్గా ఎంపికైనా.. జింబాబ్వే పర్యటనతోనే బాధ్యతలు తీసుకుంటాడా? లేక ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరిస్తాడా? అని తేలాల్సి ఉంది.
జూలై 6 నుంచి 14 వరకు జింబాబ్వేలో యంగ్ ఇండియా పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 జూలై6న, రెండో టీ20 జూలై 7న, మూడో టీ20 జూలై 10న, నాలుగో టీ20 జూలై 13న, ఐదో టీ20 జూలై 14న జరగనుంది.