సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అభినవ్ మనోహర్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్న అభినవ్ మనోహర్.. విదర్బతో శనివారం జరిగిన ఫైనల్లో 42 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 79 పరుగులు చేశాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 348 పరుగులు చేసింది.
రవిచంద్రన్ సమరణ్(92 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 101) సెంచరీతో చెలరేగాడు. కృష్ణన్ శ్రీజిత్(74 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 78) హాఫ్ సెంచరీతో రాణించాడు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే(2/67), నచికేత్ భుటే(2/70) రెండేసి వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్, యశ్ కడమ్ తలో వికెట్ తీసారు. 188 స్ట్రైక్రేట్తో అభినవ్ మనోహర్ బ్యాటింగ్ చేయడం కర్ణాటకకు కలిసొచ్చింది.

అభినవ్ మనోహర్ విధ్వంసకర బ్యాటింగ్పై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025 వేలంలో రూ. 30 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చిన అభినవ్ మనోహర్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసింది.