ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో కీలక మార్పు చేసింది. మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ను పక్కన పెట్టిన ఆరెంజ్ ఆర్మీ.. మార్కో జాన్సెన్కు అవకాశం కల్పించింది.
అయితే ఈ మార్పుకు గల కారణాన్ని మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెల్లడించలేదు. టాస్ గెలిచిన వెంటనే కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడే తమకు విజయాలు దక్కాయని తెలిపాడు. కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోగానే.. అభిమానులు గట్టిగా అరుస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

గత రెండు మ్యాచ్ల్లో తాము ముందుగా బౌలింగ్ చేసి ఓటమిపాలయ్యామని, దాంతోనే తాజా నిర్ణయంతో ఫ్యాన్స్ అంతా ఉత్సాహానికి లోనవుతున్నారని కమిన్స్ తెలిపాడు. ముందుగా బ్యాటింగ్ చేయడం తమ అతిపెద్ద బలమని, పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని చెప్పాడు. మార్క్రమ్ను తప్పించడం టీమ్మేనేజ్మెంట్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని తెలుస్తోంది.
బ్యాటింగ్ డెప్త్తో పాటు బౌలింగ్ బలాన్ని పెంచేందుకే మార్కో జాన్సెన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. బౌలింగ్తో పాటు లోయరార్డర్లో మార్కో జాన్సెన్ మెరుపులు మెరిపించగలడు. ఈ సీజన్లో మార్క్రమ్ పెద్దగా రాణించింది కూడా ఏం లేదు. దాంతోనే అతన్ని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(12)ను ఆవేశ్ ఖాన్ ఔట్ చేయగా.. ట్రావిస్ అన్మోల్ ప్రీత్ సింగ్(5)ను సందీప్ శర్మ పెవిలియన్ చేర్చాడు. దాంతో సన్రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 37 పరుగులే చేసింది. ఈ సీజన్లో సన్రైజర్స్కు ఇదే లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్. క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో ట్రావిస్ హెడ్ ఆచితూచి ఆడుతున్నాడు.