
దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్లో తమ వరుస పరాజయాలకు సన్రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు చెక్ పెట్టింది. రాజస్థాన్ రాయల్స్తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (57 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 82) హాఫ్ సెంచరీకి తోడుగా యశస్వీ జైస్వాల్(23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 36), మహిపాల్ లోమ్రోర్(28 బంతుల్లో ఫోర్, సిక్స్తో 29 నాటౌట్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో సిద్దార్థ్ కౌల్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 167 పరగులు చేసింది. జాసన్ రాయ్(42 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 60), కెప్టెన్ కేన్ విలియమ్సన్(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్, మహిపాల్ లోమ్రార్, చేతన్ సకారియా తలో వికెట్ తీశారు.
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఓపెనర్లు జాసన్ రాయ్, వృద్దిమాన్ సాహా(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 18) శుభారంభం అందించారు. ఆరెంజ్ ఆర్మీ తరఫున ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న జాసన్ రాయ్.. ఉనాద్కత్ వేసిన మూడో ఓవర్లో భారీ సిక్సర్తో తన బౌండరీల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత ముస్తాఫిజుర్ బౌలింగ్లో రెండు బౌండరీలు బాదిన రాయ్.. మోరీస్ వేసిన ఐదో ఓవర్లో మూడు ఫోర్లతో 18 పరుగులు పిండుకున్నాడు. హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని మహిపాల్ లామ్రోర్ విడదీసాడు. సాహాను స్టంపౌట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి వచ్చిన విలియమ్సన్ ఫస్ట్ బాల్నే బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు ఆచితూచి ఆడారు. క్విక్ సింగిల్స్, డబుల్స్తో పాటు వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. దాంతో హైదరాబాద్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 90 రన్స్ చేసింది.
తేవాటియా వేసిన 11వ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది జాసన్ రాయ్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరో రెండు బౌండరీలు బాదాడు. అయితే ఈ ఓవర్ ఐదో బంతికి ఎక్స్ట్రా కవర్స్లో రాయ్ ఇచ్చిన క్యాచ్ను జైస్వాల్ నేలపాలు చేశాడు. అయితే సకారియా వేసిన ఆ మరుసటి ఓవర్లోనే రాయ్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ప్రియమ్ గార్గ్ గోల్డెన్ డకౌటయ్యాడు. దాంతో క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మతో.. కేన్ మామ ఇన్నింగ్స్ను ముగించే బాధ్యతను తీసుకున్నాడు. అనవసర షాట్లు ఆడకుండా జాగ్రత్తగా ఆడాడు. దాంతో సన్రైజర్స్ విజయానికి 12 బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ముస్తాఫిజుర్ వేసిన 19వ ఓవర్లో రెండు వరుస బౌండరీలు బాదిన కేన్ మామ సన్రైజర్స్కు అద్భుత విజయాన్నందించాడు.