హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ తొలి మ్యాచ్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డు నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా సొంతమైదానంలో రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పేలవ బౌలింగ్తో ధారళంగా పరుగులు సమర్పించుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొని ఘోర తప్పిదం చేసింది. ఫ్లాట్ వికెట్పై రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు జోస్ బట్లర్(22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 54), యశస్వీ జైస్వాల్(22 బంతుల్లో 7 ఫోర్లతో 40 బ్యాటింగ్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దాంతో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 85 పరుగుల భారీ స్కోర్ చేసింది.
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే కావడం గమనార్హం. ఈ విషయంలో రాజస్థాన్ రికార్డు సృష్టిస్తే.. ధారళంగా పరుగులు సమర్పించుకున్న జట్టుగా సన్రైజర్స్ తమ పేరిట చెత్త రికార్డును లిఖించుకుంది. హాఫ్ సెంచరీ బాదిన జోస్ బట్లర్ను ఫజలక్ ఫరూకీ క్లీన్ బౌల్డ్ చేయడంతో రాజస్థాన్ జోరు కాస్త తగ్గింది. లేకుంటే ఆ జట్టు మరిన్ని పరుగులు చేసేంది.

బౌలింగ్కు ఏ మాత్రం అడ్వాంటేజ్ లభించని ఈ వికెట్పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు స్వేచ్చగా ఆడుతున్నారు. బట్లర్ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్తో జైష్వాల్ చెలరేగుతున్నాడు. దాంతో ఆ జట్టు 10 ఓవర్లలోనే 122 పరుగులు చేసింది. భువనేశ్వ కుమార్ బౌలర్లను మార్చినా.. ఫీల్డ్ సెట్ చేసినా లాభం లేకపోయింది.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చూసిన తర్వాత భువనేశ్వర్ కుమార్పై హైదరాబాద్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఫ్లాట్గా ఉన్న వికెట్పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం ఏంటని మండిపడుతున్నారు. అంతేకాకుండా సన్రైజర్స్ బౌలర్లు ప్రాక్టీస్ చేశారా? లేక నేరుగా మ్యాచ్ ఆడుతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదీ ఏమైనా.. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.