ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో సమష్టిగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. షెహ్బాజ్ అహ్మద్(3/23), అభిషేక్ శర్మ(2/24) సంచలన బౌలింగ్తో మ్యాచ్ను మలుపుతిప్పారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(34 బంతుల్లో 4 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎయిడెన్ మార్క్రమ్(15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 37), ట్రావిస్ హెడ్(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 34) రాణించారు.

ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం..
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్ మూడేసి వికెట్లు తీయగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులే చేసి ఓటమిపాలైంది. ధ్రువ్ జురెల్(35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 42) పర్వాలేదనిపించాడు.
మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో షేహ్బాజ్ అహ్మద్(3/23) మూడు వికెట్లు తీయగా.. అభిషేక్ శర్మ(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్, నటరాజన్ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో సన్రైజర్స్ హైదరాబాద్.. ఆదివారం జరిగే ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్తో అమీతుమీ తేల్చుకోనుంది.
దెబ్బతీసిన కమిన్స్..
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. చాలా స్లోగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ టామ్ కోహ్లేర్(10) కమిన్స్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి సంజూ శాంసన్ రాగా.. భువనేశ్వర్ కుమార్ వేసిన 6వ ఓవర్లో జైస్వాల్ 6 ,4, 0, 4, 4, 1తో 19 పరుగులు పిండుకున్నాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది.
మలుపు తిప్పిన షెహ్బాజ్ అహ్మద్..
షెహ్బాజ్ అహ్మద్ వేసిన 8వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన యశస్వి జైస్వాల్.. అదే ఓవర్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ వేసిన మరుసటి ఓవర్లో సంజూ శాంసన్ భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు. షెహ్బాజ్ అహ్మద్ తన మరుసటి ఓవర్లో రియాన్ పరాగ్(6), రవిచంద్రన్ అశ్విన్(0)లను క్యాచ్ ఔట్గా బోల్తా కొట్టించి మ్యాచ్ను మలుపు తిప్పాడు.
క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెట్మైర్(4)ను కూడా అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్పై సన్రైజర్స్ పట్టుబిగ్గించింది. ఈ పరిస్థితుల్లో రోవ్మన్ పోవెల్(6) సాయంతో ధ్రువ్ జురెల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అయితే పోవెల్(6)ను నటరాజన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ పూర్తిగా సన్రైజర్స్ వశమైంది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం చేశాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండటంతో సన్రైజర్స్ విజయం లాంఛనమైంది.