సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహకారంతోనే సెంచరీ చేశానని ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తెలిపాడు. కెప్టెన్గా కమిన్స్.. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చ ఇచ్చాడని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లతో 106 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్ర మ్యాచ్లోనే ఇషాన్ కిషన్ ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్లోనూ అతనికి ఇదే తొలి సెంచరీ.
సన్రైజర్స్ ఇన్నింగ్స్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన ఇషాన్ కిషన్.. తన సెంచరీ క్రెడిట్ టీమ్మేనేజ్మెంట్తో పాటు ప్యాట్ కమిన్స్దేనని తెలిపాడు. 'ఈ సెంచరీ చాలా సంతోషాన్నిచ్చింది. గత కొంతకాలంగా ఇది ఊరిస్తోంది. గత సీజన్లోనే శతకం సాధించాలనుకున్నాను. కానీ ఈ సీజన్ మొదటి మ్యాచ్లోనే దక్కడం ఆనందంగా ఉంది. జట్టు నాపై పూర్తి నమ్మకం ఉంచింది. నేను.. నా వంతు రాణించాలనుకున్నాను.

కెప్టెన్ కమిన్స్ మా అందరికి పూర్తి స్వేచ్చనివ్వడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు. సెంచరీ చేసినా.. డకౌట్ అయినా పర్వాలేదని చెప్పారు. టీమ్మేనేజ్మెంట్కు హ్యాట్సాఫ్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ దూకుడైన ఆరంభంతో మంచి ఫ్లాట్ఫామ్ సెట్ చేశారు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగానే ఉంది. రాజస్థాన్ బౌలర్లు మెరుగ్గానే బౌలింగ్ చేశారు. మేం సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేస్తే సరిపోతుంది.'అని ఇషాన్ కిషన్ తెలిపాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్తో పాటు ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 67), నితీష్ కుమార్ రెడ్డి(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 30), హెన్రీచ్ క్లాసెన్(14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 34) రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తీక్షణ(2/52) రెండు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్పాండే(3/38) మూడు వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మ(1/51) ఒక వికెట్ తీసాడు.