ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో సంచలన విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్తో ఉప్పల్ వేదికగా ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. సన్రైజర్స్ హైదరాబాద్ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సంచలన బౌలింగ్తో అద్భుత విజయాన్నందుకుంది.
భువీ ఆఖరి బంతికి వికెట్ తీసి సన్రైజర్స్ ఓటమిని తప్పించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 58), నితీష్ కుమార్ రెడ్డి(42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్లతో 76 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 42 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులే చేసి ఓటమిపాలైంది. యశస్వి జైస్వాల్(40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 67), రియాన్ పరాగ్(49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 77) హాఫ్ సెంచరీలతో రాణించారు. సన్రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, నటరాజన్ రెండేసి వికెట్లు తీసారు.
నిప్పులు చెరిగిన భువీ
202 పరుగుల భారీ లక్ష్య ఛేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే జోస్ బట్లర్(0), సంజూ శాంసన్(0) డకౌట్గా వెనుదిరిగారు. బట్లర్ క్యాచ్ ఔటవ్వగా.. సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్తో కలిసి యశస్వి జైస్వాల్ చెలరేగాడు.
చెత్త ఫీల్డింగ్..
7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఇచ్చిన సునాయస క్యాచ్ను మిడాఫ్లో ప్యాట్ కమిన్స్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను చెలరేగాడు. వరుస బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టాడు. నటరాజన్ వేసిన 6వ ఓవర్లో రియాన్ పరాగ్ ఇచ్చిన క్యాచ్ను ఎక్స్ట్రా కవర్స్లో అభిషేక్ శర్మ అందుకోలేకపోయాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 60 పరుగులు చేసింది.
అనంతరం ఆచితూచి ఆడిన ఈ జోడీ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. ఈ క్రమంలో జైస్వాల్, రియాన్ పరాగ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అనంతరం మరింత దూకుడు ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. అయితే నటరాజన్ వేసిన 14వ ఓవర్లో జైస్వాల్ వినూత్న షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
మలుపు తిప్పిన కమిన్స్..
సన్రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తరహాలోనే వికెట్ పారేసుకున్నాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 133 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన హెట్మైర్తో కలిసి రియాన్ పరాగ్ దూకుడుగా ఆడాడు. కానీ అతని జోరుకు ప్యాట్ కమిన్స్ బ్రేక్ వేసాడు. స్టన్నింగ్ డెలివరీతో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. కానీ క్రీజులోకి వచ్చిన రోవ్మన్ పోవెల్, హెట్ మైర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.
అయితే దూకుడుగా ఆడుతున్న హెట్మైర్ను నటరాజన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు అవసరమయ్యాయి. అయితే కమిన్స్ వేసిన 19వ ఓవర్లో ధ్రువ్ జురెల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. అతను ఆడిన భారీ షాట్ను బౌండరీ లైన్పై అభిషేక్ శర్మ అందుకున్నాడు.
భువీ సంచలనం
తర్వాతి ఐదు బంతుల్లో కమిన్స్ 7 పరుగులు ఇవ్వడంతో చివరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. భువనేశ్వర్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్లో రోవ్మన్ పోవెల్ ఓ బౌండరీతో పాటు క్విక్ డబుల్స్ తీయడంతో.. ఆఖరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి. అయితే చివరి బంతికి భువనేశ్వర్ కుమార్ పోవెల్ను ఔట్ చేసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.