ఐపీఎల్ 2024 సీజన్ తుది దశకు చేరింది. మరో రెండు మ్యాచ్లతో ఈ టోర్నీకి తెరపడనుంది. ఇప్పటికే క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించిన కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) ఫైనల్ చేరగా.. ఎలిమినేటర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)ని ఓడించిన రాజస్థాన్ రాయల్స్.. క్వాలిఫయర్-2కు సిద్దమైంది.
క్వాలిఫయర్-1లో ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్తో చెన్నై వేదికగా శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం ఇదే వేదికగా జరిగే ఫైనల్లో కేకేఆర్తో తలపడనుంది.

చెన్నైలో భారీ వర్షాలు..
అయితే క్వాలిఫయర్-2 మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంతో పాటు 7 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 48 గంటల పాటు(మే 23, 24) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది.
నైరుతి బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడునున్నట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. 48 గంటల్లో ఇది వాయుగుండగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతోనే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. చెన్నై వేదికగానే క్వాలిఫయర్-2తో పాటు ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్లకు వర్షం ముప్పు పొంచి ఉంది.

వర్షంతో మ్యాచ్ రద్దయితే..
సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తే రిజర్వ్డే అయిన మరుసటి రోజు ఆటను కొనసాగిస్తారు. క్వాలిఫయర్-2తో పాటు ఫైనల్కు కూడా రిజర్వ్ డేను కేటాయించారు. ఒకవేళ రిజర్వ్ డే కూడా మ్యాచ్ జరగకపోతే.. పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది. ఈ లెక్కన సన్రైజర్స్ హైదరాబాద్.. కేకేఆర్తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
ఒక వేళ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే.. రిజర్వ్ డే కూడా సాధ్యం కాకపోతే టేబుల్ టాపర్ అయిన కేకేఆర్ను విజేతగా ప్రకటిస్తారు. అయితే ఐపీఎల్ చరిత్రలో ఏ సీజన్ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దవ్వాలి. గతేడాది అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో రిజర్వ్ డే మ్యాచ్ కొనసాగించారు. ఈ మ్యాచ్లో సీఎస్కే విజయం సాధించి ఐదో టైటిల్ను సొంతం చేసుకుంది.