హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంతో ప్రారంభించింది. నాలుగేళ్ల తర్వాత సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో చెత్త ఆటతో 72 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. పేలవ బౌలింగ్, చెత్త బ్యాటింగ్తో అభిమానులకు తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది.
రాజస్థాన్ రాయల్స్ టాప్-3 బ్యాటర్లు యశస్వీ జైస్వాల్(37 బంతుల్లో 9 ఫోర్లతో 54), జోస్ బట్లర్(22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 54), సంజూ శాంసన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 55) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సన్రైజర్స్ బౌలర్లలో నటరాజన్(2/23) ఒక్కడే రాణించగా.. ఫజలక్ ఫరూఖీ(2/41), ఉమ్రాన్ మాలిక్(1/32) వికెట్లు తీసినా ధారళంగా పరుగులిచ్చారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. మయాంక్ అగర్వాల్(23 బంతుల్లో 3 ఫోర్లతో 27), ఇంపాక్ట్ ప్లేయర్ అబ్దుల్ సమద్(31 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 32 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి డకౌటవ్వగా.. హరీ బ్రూక్(13), వాషింగ్టన్ సుందర్(1), గ్లేన్ ఫిలిప్స్(8), ఆదిల్ రషీద్(18), భువనేశ్వర్ కుమార్(6) తీవ్రంగా నిరాశపరిచారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(4/17) నాలుగు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు. జాసన్ హోల్డర్, అశ్విన్కు చెరొక వికెట్ దక్కింది.
బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై టాస్ గెలిచిన భువనేశ్వర్ కుమార్ ఫీల్డింగ్ ఎంచుకోవడం, పవర్ ప్లేలో ధారళంగా పరుగులివ్వడం, పేలవ బ్యాటింగ్ సన్రైజర్స్ ఓటమిని శాసించాయి. ముఖ్యంగా ఖాతా తెరవకుండానే బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో ఇద్దరూ బ్యాటర్లు డకౌట్గా వెనుదిరగడం.. మెయిడిన్ ఓవర్ అవ్వడం సన్రైజర్స్ను కోలుకోలేని దెబ్బతీసింది. ఫస్ట్ ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోవడంతో తర్వాతి బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. భారీ లక్ష్యం ఉన్న నేపథ్యంలో స్వేచ్చగా ఆడలేకపోయారు.