హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. పేలవ బౌలింగ్తో ధారళంగా పరుగులిచ్చుకున్నారు. బ్యాటింగ్కు అడ్వాంటేజ్గా ఉన్న వికెట్పై రాజస్థాన్ రాయల్స్ త్రయం యశస్వీ జైస్వాల్(37 బంతుల్లో 9 ఫోర్లతో 54), జోస్ బట్లర్(22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 54), సంజూ శాంసన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 55) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. సన్రైజర్స్ యార్కర్ల కింగ్ టీ నటరాజన్ కాస్త కట్టడి చేయడంతో రాజస్థాన్ రాయల్స్ జోరుకు బ్రేక్ పడింది. తొలి ఓవర్లో 17 పరుగులిచ్చుకున్న నటరాజన్.. తర్వాత రెండు ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఫజలక్ ఫరూఖీ రెండు, ఉమ్రాన్ మాలిక్ ఓ వికెట్ తీసినా ధారళంగా పరుగులిచ్చారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొని సన్రైజర్స్ ఘోర తప్పిదం చేసింది. ఫ్లాట్ వికెట్పై రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దాంతో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 85 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావడం విశేషం.
బట్లర్ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్, జైష్వాల్ చెలరేగారు. దాంతో రాజస్థాన్ 10 ఓవర్లలోనే 122 పరుగులు చేసింది. ఈ పరిస్థితుల్లో జైస్వాల్ను ఫరూకీ ఔట్ చేసి రెండో వికెట్కు నమోదైన 54 పరుగుల భాగస్వామ్యానికి తెరదించగా.. సంజూ శాంసన్, రియాన్ పరాగ్లను నటరాజ్ పెవిలియన్ చేర్చి భారీ స్కోర్కు బ్రేక్లు వేసాడు.
షిమ్రాన్ హెట్మైర్(22 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ 200 పరుగుల మార్క్ను అందుకుంది. ఓ దశలో రాజస్థాన్ 250 పరుగులు చేస్తుందా? అనిపించింది. కానీ నటరాజన్ సూపర్ బౌలింగ్తో ఆదుకున్నాడు.