
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లోనూ కింగ్ కోహ్లీ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. మార్కో జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ రెండో బంతికి కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(5) క్లీన్ బౌల్డ్ కాగా.. క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతికే స్లిప్ క్యాచ్గా వెనుదిరిగాడు. జాన్సెన్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ను కోహ్లీ.. మిడాఫ్ దిశగా డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా సెకండ్ స్లిప్ చేతిలోకి వెళ్లింది.
అయితే ఈ వికెట్ క్రెడిట్ మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్దేనని చెప్పాలి. కోహ్లీ బలహీనతలపై మంచి హోమ్ వర్క్ చేసి వచ్చిన కేన్ మామ.. అతను క్రీజులోకి రాగానే సెకండ్ స్లిప్ ఫీల్డర్ను తీసుకొచ్చాడు. బౌలర్ కూడా కేన్ మామ వ్యూహం తగ్గట్లు బాల్ వేయడంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన గత మ్యాచ్లోను కోహ్లీ గోల్డెన్ డకౌటయ్యాడు. దాంతో వరుస మ్యాచ్ల్లో గోల్డెన్ డక్ ఔటైన అప్రతిష్టను కోహ్లీ తన పేరిట లిఖించుకున్నాడు. మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ ఇలా వరుసగా గోల్డెన్ డకౌటవ్వడం అతని 14 ఏళ్ల ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్లో ఇదే తొలిసారి.
ఇక విరాట్ కోహ్లీకి ఈ సీజన్లో ఏది కలిసి రావడం లేదు. ఏడు మ్యాచ్ల్లో ఒకే ఒక్కసారి 48 పరుగులు చేసిన కోహ్లీ రెండు సార్లు రనౌటయ్యాడు. అతనికి కాలం ఏం కలిసి రావడం లేదు. ఇక విరాట్ కోహ్లీ ఇలా ఔటవ్వడాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మార్కో జాన్సెన్ ఇదే ఓవర్ ఆఖరి బంతికి అనూజ్ రావత్(0)ను కూడా ఔట్ చేసి ఒకే ఓవర్లో మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. నటరాజన్ బౌలింగ్లో కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ క్యాచ్తో గ్లేన్ మ్యాక్స్వెల్(12) కూడా ఔటవ్వడంతో ఆర్సీబీ 20 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.