
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో వరుస విజయాలతో జోరు కనబర్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి సన్రైజర్స్ హైదరాబాద్ గట్టి షాక్ ఇచ్చింది. సన్రైజర్స్ హైదరబాద్ బౌలర్లు మార్కో జాన్సెన్(3/25), నటరాజన్(3/10), జగదీష్ సుచీత్(2/12) సమష్టిగా చెలరేగడంతో ఆర్సీబీ 16.1 ఓవర్లలో 68 పరుగులకు కుప్పకూలింది. సుయాశ్ ప్రభుదేశాయ్(15), గ్లేన్ మ్యాక్స్వెల్ డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాట్స్మన్ దారుణంగా విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ(0)తో పాటు అనూజ్ రావత్(0), దినేశ్ కార్తీక్(0) డకౌట్గా వెనుదిరిగారు. సన్రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ దక్కింది.
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీకి ఇది సెకండ్ లోయెస్ట్ స్కోర్ కాగా.. ఓవరాల్గా 6వది. 2017లో 49 పరుగులు చేసి అత్యల్ప స్కోర్ చేసిన చెత్త రికార్డును మూటగట్టుకున్న ఆర్సీబీ.. మళ్లీ ఐదేళ్ల తర్వాత 68 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీని మార్కో జాన్సెన్ దెబ్బతీసాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(5), విరాట్ కోహ్లీ(0)లను వరుస బంతుల్లో ఔట్ చేసిన జాన్సెన్.. చివరి బంతికి అనూజ్ రావత్(0)ను ఔట్ చేశాడు. దాంతో రెండో ఓవర్లోనే ఆర్సీబీ కీలక మూడు వికెట్లు కోల్పోయింది.
నటరాజన్ వేసిన 5వ ఓవర్లో కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ క్యాచ్కు గ్లేన్ మ్యాక్స్వెల్(12) వెనుదిరగడంతో ఆర్సీబీ 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. సుయాశ్ ప్రభుదేశాయ్, దినేశ్ కార్తీక్(0)లు కూడా విఫలమవడంతో ఆర్సీబీ పతనం ఖాయమైంది. హర్షల్ పటేల్(4), వానిందు హసరంగా(8), మహమ్మద్ సిరాజ్(2) వరుసగా విఫలమవడంతో 16.1 ఓవర్లలోనే ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసింది.