ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. పంజాబ్ కింగ్స్తో ఉప్పల్ వేదికగా జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానానికి చేరింది. రాజస్థాన్ రాయల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్లో ఓటమిపాలైతే సన్రైజర్స్ రెండో స్థానాన్ని కైవసం చేసుకోనుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 71) హాఫ్ సెంచరీతో రాణించగా.. అథర్వ టైడ్(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 46), రిలీ రోసౌ(24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 49) తృటిలో అర్థ శతకాలు చేజార్చుకున్నారు.

చివర్లో జితేశ్ శర్మ(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో టీ నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, విజయ్కాంత్ వియాస్కంత్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 66), హెన్రీచ్ క్లాసెన్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 42 ) సత్తా చాటారు. రాహుల్ త్రిపాఠి(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 33), నితీష్ కుమార్ రెడ్డి(25 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 37) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు.
ఆరంభంలోనే బిగ్ షాక్..
215 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అర్ష్దీప్ సింగ్ వేసిన తొలి బంతికే డేంజరస్ ట్రావిస్ హెడ్(0) గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠితో కలిసి అభిషేక్ శర్మ చెలరేగాడు. రాహుల్ త్రిపాఠి సైతం భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న అతన్ని హర్షల్ పటేల్ ఔట్ చేశాడు.
దాంతో పవర్ ప్లేలో సన్రైజర్స్ 2 వికెట్లకు 84 పరుగులు చేసింది. క్రీజులోకి నితీష్ కుమార్ రెడ్డి రాగా.. అభిషేక్ శర్మ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత దూకుడుగా ఆడిన అతన్ని శశాంక్ సింగ్ బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన హెన్రీచ్ క్లాసెన్ సైతం తనదైన శైలిలో ధాటిగా ఆడగా.. నితీష్ కూడా బ్యాట్కు పని చెప్పాడు.
అయితే హర్షల్ పటేల్ బౌలింగ్లో నితీష్ కుమార్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ వెంటనే షెహ్బాజ్ అహ్మద్(3) అర్ష్దీప్ సింగ్ ఔట్ చేయగా.. నిలకడగా ఆడుతున్న హెన్రీచ్ క్లాసెన్ను హర్ప్రీత్ బ్రార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. చివరి ఓవర్లో సన్రైజర్స్ విజయానికి నాలుగు పరుగులు అవసరమవ్వగా.. సన్వీర్ సింగ్ బౌండరీ బాది విజయలాంఛనాన్న పూర్తి చేశాడు.