హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు విజయాన్నందుకుంది. వరుసగా రెండు ఓటముల అనంతరం పంజాబ్ కింగ్స్తో ఆదివారం జరిగిన మూడో మ్యాచ్లో సమష్టి ప్రదర్శనతో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్లో మయాంక్ మార్కండే సత్తా చాటితే బ్యాటింగ్లో రాహుల్ త్రిపాఠి(48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 74 నాటౌట్) దుమ్మురేపాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్లతో 99 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్తో రాణించగా.. సామ్ కరణ్(22) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే(4/15) నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 17.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 145 పరుగులు చేసి గెలుపొందింది. రాహుల్ త్రిపాఠికి తోడుగా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్(21 బంతుల్లో 6 ఫోర్లతో 37 నాటౌట్)రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన రూ.13.25 కోట్ల ఆటగాడు హరీ బ్రూక్(13) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. మయాంక్ అగర్వాల్(20 బంతుల్లో 3 ఫోర్లతో 21) స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో హరీ బ్రూక్ క్లీన్ బౌల్డ్ కాగా.. మయాంక్ అగర్వాల్ను దీపక్ చాహర్ ఔట్ చేశాడు.
రెండు ఓటముల తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ గెలవడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీమ్ ఓనర్ కావ్య మారన్ సైతం ఊపిరి పీల్చుకుంది. తొలి విజయంతో కావ్య చిరునవ్వులు చిందించింది.