ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 82) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్(23 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 42), ప్రియాన్ష్ ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 36) రాణించారు.
సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/42) నాలుగు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు. చివర్లో హర్షల్ పటేల్ కట్టుదిట్టమైన బౌలింగ్తో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్కు బ్రేక్ వేయగా.. ఆఖరి ఓవర్లో షమీ ధారళంగా పరుగులిచ్చాడు. స్లోయినీస్(11 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 34 నాటౌట్) వరుసగా నాలుగు సిక్స్లు బాది గేమ్ మూమెంటమ్ను మార్చేశాడు. నాలుగు ఓవర్లలో షమీ 75 పరుగులు సమర్పించుకున్నాడు.

చెలరేగిన ఓపెనర్లు..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ తమ ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించింది. షమీ వేసిన తొలి ఓవర్లోనే ప్రభ్సిమ్రాన్ సింగ్ హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. కమిన్స్ వేసిన రెండో ఓవర్లో ప్రియాన్ష్ ఆర్య 6, 4 కొట్టగా.. ప్రభ్సిమ్రాన్ సింగ్ ఓ బౌండరీ బాదడంతో 16 పరుగులు వచ్చాయి. షమీ వేసిన మూడో ఓవర్లో ప్రియాన్ష్ ఆర్య వరుసగా రెండు సిక్స్లు, ఓ బౌండరీ కొట్టగా.. ప్రభ్సిమ్రాన్ సింగ్ ఆఖరి బంతి సిక్సర్గా తరలించాడు. దాంతో మూడు ఓవర్లలోనే పంజాబ్ 53 పరుగులు చేసింది. హర్షల్ పటేల్కు బంతినిచ్చిన కమిన్స్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు.
ప్రియాన్ష్ ఆర్య(36)ను హర్షల్ పటేల్ స్లోయర్ బాల్తో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దాంతో పంజాబ్ పరుగుల వేగం కాస్త తగ్గింది. హర్షల్ పటేల్ బౌలింగ్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ ఇచ్చిన క్యాచ్ను కవర్స్లో అభిషేక్ శర్మ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను ఆఖరి బంతికి సిక్సర్ తరలించాడు. దాంతో పవర్ ప్లేలోనే పంజాబ్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది.
అయ్యర్ విధ్వంసం..
అనంతరం బౌలింగ్ చేసిన ఇషాన్ మలింగా.. ప్రభ్సిమ్రాన్ సింగ్(42)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. జీషన్ అన్సారీ కూడా కట్టడిగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ పరుగుల వేగం తగ్గింది. కానీ ఇషాన్ మలింగాపై అయ్యర్ రెండు భారీ సిక్స్లతో విరుచుకుపడ్డాడు. జీషాన్ వేసిన 12వ ఓవర్లో రెండు సిక్స్లు, ఫోర్ బాది 20 పరుగులు పిండుకున్నాడు. మరోవైపు నెహాల్ వధేరా కూడా దూకుడుగా ఆడాడు.
జీషన్ అన్సారీ బౌలింగ్లో బౌండరీ లైన్పై శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్ను అభిషేక్ శర్మ నేలపాలు చేశాడు. దాంతో అది కాస్త సిక్సర్గా వెళ్లింది. షమీ బౌలింగ్లో థర్డ్ మాన్ దిశగా బౌండరీ బాదిన అయ్యర్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నెహాల్ వధేరాను ఇషాన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అయితే రిప్లేలో ఇది నాటౌట్గా తేలింది. కానీ వధేరా రివ్యూ తీసుకోకుండా పెవిలియన్ చేరాడు.
మలుపు తిప్పిన హర్షల్ పటేల్..
ఆ మరుసటి ఓవర్లోనే డేంజరస్ శశాంక్ సింగ్(2)ను హర్షల్ పటేల్ ఔట్ చేయగా.. మ్యాక్సీతో కలిసి అయ్యర్ చెలరేగాడు. ఇషాన్ మలింగా బౌలింగ్లో నాలుగు బౌండరీలు బాది జట్టు స్కోర్ను 200 ధాటించాడు. 18వ ఓవర్లో హర్షల్ పటేల్ మ్యాక్స్వెల్(3)తో పాటు శ్రేయస్ అయ్యర్ను పెవిలియన్ చేర్చాడు. మ్యాక్సీని క్లీన్ బౌల్డ్ చేసిన హర్షల్ పటేల్.. అయ్యర్ను స్లోయర్ బాల్తో క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో ఈ ఓవర్లో 5 పరుగులే వచ్చాయి. 19వ ఓవర్లో కమిన్స్ ఒక బౌండరీ మాత్రమే ఇవ్వడంతో 8 పరుగులే వచ్చాయి. షమీ వేసిన ఆఖరి ఓవర్లో స్టోయినీస్ వరుసగా 4 సిక్స్లు బాది జట్టుకు 245 పరుగుల భారీ స్కోర్ అందించాడు. ఆఖరి ఓవర్లో వచ్చిన 27 పరుగులు గేమ్ ఛేజింగ్ మూమెంటమ్గా మారాయి.