హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు చెలరేగారు. అయితే శిఖర్ ధావన్(66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్లతో 99 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడటంతో పంజాబ్.. హైదరాబాద్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. ధావన్కు తోడుగా సామ్ కరణ్(22) రాణించగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే(4/15) నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్కు ఓ వికెట్ దక్కింది.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు భువనేశ్వర్ కుమార్ గట్టి షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ప్రభ్సిమ్రాన్ సింగ్(0)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే మాథ్యూ షార్ట్(1)ను మార్కో జాన్సెన్ ఔట్ చేశాడు. తన మరుసటి ఓవర్లో జితేశ్ శర్మను కూడా పెవిలియన్ చేర్చడంతో పంజాబ్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 41 పరుగులు మాత్రమే చేసింది.
పవర్ ప్లే అనంతరం మయాంక్ మార్కండేను మార్క్రమ్ రంగంలోకి దించగా.. అతను సామ్ కరణ్(22)ను ఔట్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సికిందర్ రాజా(5)ను ఉమ్రాన్ మాలిక్ ఔట్ చేయగా.. షారూఖ్ ఖాన్(1) మార్కండే, హర్ప్రీత్ బ్రార్(1) ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్ చేర్చారు. తన చివరి ఓవర్లో మార్కండే.. రాహుల్ చాహర్(0), నాథన్ ఎల్లిస్(0)లను ఔట్ చేయగా.. మోహిత్ రతీ సాయంతో శిఖర్ ధావన్ విధ్వంసకర బ్యాటింగ్తో పోరాడే లక్ష్యాన్ని అందించాడు. చివరి వికెట్కు ధావన్ 55 పరుగులు జోడించడం విశేషం.