హైదరాబాద్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 6 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు బాదిన రోహిత్.. ఐపీఎల్లో 6వేల పరుగుల మార్క్ను అందుకున్నాడు. ఐపీఎల్లో ఈ ఘనతను అందుకున్న నాలుగో బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు.
ఈ జాబితాలో 6844 పరుగులతో విరాట్ కోహ్లీ టాప్లో ఉండగా.. శిఖర్ ధావన్ 6477 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. 6109 పరుగులతో వార్నర్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ మ్యాచ్లో దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ ఇన్నింగ్స్కు నటరాజన్ బ్రేక్ వేసాడు. అతను వేసిన స్లోయర్ ఆఫ్కట్టర్ను రోహిత్ భారీ షాట్గా మలిచే ప్రయత్నంలో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 18 బంతుల్లో 6 ఫోర్లతో రోహిత్ 28 పరుగులు చేసాడు. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్తో ఇషాన్ కిషన్ ధాటిగా ఆడాడు. అయితే అతని జోరుకు మార్క్ జాన్సెన్ బ్రేక్ వేసాడు. క్యాచ్ ఔట్గా ఇషాన్ కిషన్(38)ను పెవిలియన్ చేర్చాడు.
అదే ఓవర్లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(7)ను ఎయిడెన్ మార్క్రమ్ సూపర్ డైవ్ క్యాచ్తో ఔట్ చేశాడు. వచ్చిరావడంతోనే భారీ సిక్సర్ బాదిన సూర్య.. జాన్సెన్ వేసిన కట్టర్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ మిడాఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న మార్క్రమ్ సూపర్ డైవ్తో బంతిని అందుకున్నాడు. దాంతో ముంబై 95 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.