ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్తో ఉప్పల్ వేదికగా బుధవారం ఉత్కంఠగా సాగిన హైస్కోరింగ్ గేమ్లో 31 పరుగుల తేడాతో గెలుపొందింది. సిక్సర్ల వర్షం కురిసిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్(24 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్లతో 62), అభిషేక్ శర్మ(23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 63), హెన్రీచ్ క్లాసెన్(34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్లతో 80 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. ఎయిడెన్ మార్క్రమ్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 42 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కోయిట్జీ, పియూష్ చావ్లా తలో వికెట్ తీసారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేసింది.
తిలక్ వర్మ(34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 64) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. టీమ్ డేవిడ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 42 నాటౌట్) రాణించాడు.
సన్రైజర్స్ బౌలర్లలో కమిన్స్, ఉనాద్కత్ రెండేసి వికెట్లు తీయగా.. షెహ్బాజ్ అహ్మద్ ఓ వికెట్ తీసాడు. క్రీజులో సెట్ అయిన లోకల్ భాయ్ తిలక్ వర్మను ఔట్ చేసి కమిన్స్ మ్యాచ్ను మలుపు తిప్పాడు.

చెలరేగిన తెలుగోడు..
278 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు రోహిత్ శర్మ(26), ఇషాన్ కిషన్(34) శుభారంభం అందించారు. ఈ జోడీ అటాకింగ్ గేమ్తో చెలరేగడంతో ముంబై 3 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే ఇషాన్ కిషన్ను షెహ్బాజ్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే రోహిత్ శర్మను ప్యాట్ కమిన్స్ ఔట్ చేయడంతో పవర్ ప్లేలో ముంబై 2 వికెట్లకు 76 పరుగులు చేసింది.
ఈ పరిస్థితుల్లో నమాన్ ధిర్(30), తిలక్ వర్మ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ప్రతీ ఓవర్లో బౌండరీలు బాదుతూ సన్రైజర్స్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలోనే ఉనద్కత్ బౌలింగ్లో తిలక్ వర్మ బౌండరీ బాది 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 'ఇది నా అడ్డా.. నేను చూస్కుంటా'అని ముంబై డగౌట్వైపు సైగలు చేశాడు. అయితే ఈ ఓవర్లోనే నమన్ ధిర్ను ఉనాద్కత్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.

మలుపు తిప్పిన కమిన్స్..
క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా సైతం భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ పరిస్థితుల్లో భువనేశ్వర్ కుమార్ 13వ ఓవర్ను కట్టడిగా వేసి 5 పరుగులే ఇచ్చాడు. మయాంక్ మార్కండే బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన తిలక్ వర్మ.. 12 పరుగులు పిండుకున్నాడు. జోరు మీదున్న తిలక్ వర్మను కమిన్స్.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. ఈ వికెట్తో పాటు మూడు పరుగులే ఇచ్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు.
16వ ఓవర్ వేసిన ఉనాద్కత్ 5 పరుగులే ఇవ్వడంతో ముంబైపై ఒత్తిడి పెరిగింది. కానీ భువీ వేసిన 17వ ఓవర్లో టీమ్ డేవిడ్ 6, 4, 6తో 20 పరుగులు పిండుకున్నాడు. ఉనాద్కత్ వేసిన 18 ఓవర్లో హార్దిక్ పాండ్యా ఔటవ్వడంతో మ్యాచ్ సన్రైజర్స్వైపు మళ్లింది. 19వ ఓవర్లో కమిన్స్ 7 పరుగులే ఇవ్వడంతో ఆఖరి ఓవర్లో హైదరాబాద్ విజయానికి 47 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో 15 పరుగులే రావడంతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది.