హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ ఆ జట్టు గెలుపొందింది. సన్రైజర్స్ హైదరాబాద్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. పేలవ బ్యాటింగ్తో సునాయసంగా గెలిచే మ్యాచ్ను సన్రైజర్స్ చేజార్చుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్(40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. లోకల్ బాయ్ తిలక్ వర్మ(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 37), ఓపెనర్లు రోహిత్ శర్మ(18 బంతుల్లో 6 ఫోర్లతో 28), ఇషాన్ కిషన్(31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) మెరుపులు మెరిపించారు.

సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 19.5 ఓవర్లలో 178 పరుగులకు కుప్పకూలింది. మయాంక్ అగర్వాల్(41 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 48), హెన్రీచ్ క్లాసెన్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36) మినహా అంతా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్, రిలీ మెరిడిత్, పియూష్ చావ్లా తలో వికెట్ తీయగా.. అర్జున్ టెండూల్కర్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు.
శుభారంభం లేదు..
భారీ లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు సరైన శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్ విన్నర్, సెంచరీ హీరో హ్యారీ బ్రూక్(9) దారుణంగా విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే జాసన్ బెహెండార్ఫ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ కొద్ది సేపటికే మెరిడిత్ బౌలింగ్లో రాహుల్ త్రిపాఠి(7) కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన మార్క్రమ్ రాగా.. పవర్ ప్లేలో సన్రైజర్స్ 2 వికెట్లు కోల్పోయి 42 పరుగులు మాత్రమే చేసింది.
క్లాసెన్ మెరుపులు..
పవర్ ప్లే అనంతరం ధాటిగా ఆడిన ఎయిడెన్ మార్క్రమ్(22)ను కామెరూన్ గ్రీన్ ఔట్ చేశాడు. ఆ వెంటనే పియూష్ చావ్లా బౌలింగ్లో అభిషేక్ శర్మ(1) భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో హెన్రీచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా హెన్రీచ్ క్లాస్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. పియూష్ చావ్లా బౌలింగ్లో వరుసగా 4, 6, 6, 4 బాదిన క్లాసెన్.. ఆ ఓవర్ చివరి బంతికి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔటయ్యాడు.
అదరగొట్టిన అర్జున్..
అబ్దుల్ సమద్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగగా.. మయాంక్ అగర్వాల్ను మెరిడిత్ ఔట్ చేశాడు. మార్కో జాన్సెన్(13), సుందర్(10) భారీ షాట్లతో జట్టును లక్ష్యం వైపు నడిపించారు. కానీ జాన్సెన్ను మెరిడిత్ క్యాచ్ ఔట్ చేయగా.. సుందర్(10)ను టీమ్ డేవిడ్ రనౌట్ చేశాడు. 19వ ఓవర్లో గ్రీన్ 4 పరుగులే ఇవ్వడంతో సన్రైజర్స్ విజయానికి చివరి ఓవర్లో 20 పరుగులు అవసరమయ్యాయి.
అర్జున్ టెండూల్కర్ వేసిన ఆఖరి ఓవర్లో సమద్ క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో రనౌటవ్వడంతో ముంబై విజయం లాంఛనమైంది. భువనేశ్వర్ కుమార్ను అర్జున్ ఔట్ చేయడంతో సన్రైజర్స్ ఆలౌటైంది.