ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఊహించని షాక్ తగిలింది. ఘన విజయంతో ఈ టోర్నీ ప్రారంభించిన ఆరెంజ్ ఆర్మీ.. రెండో మ్యాచ్లోనే లక్నో సూపర్ జెయింట్స్తో ఓటమిపాలైంది. గురువారం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో సన్రైజర్స్ను ఓడించింది. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్రైజర్స్ను వ్యూహాత్మకంగా లక్నో సూపర్ జెయింట్స్ దెబ్బతీసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్(4/34) సంచలన బౌలింగ్తో హైదరాబాద్ బ్యాటర్ల పతనాన్ని శాసించాడు. డేంజరస్ అభిషేక్ శర్మ(6), ఇషాన్ కిషన్(0)ను వరుస బంతులతో ఔట్ చేయడంతో పాటు డెత్ ఓవర్లలో అభినవ్ మనోహర్, మహమ్మద్ షమీలను పెవిలియన్ చేర్చి సన్రైజర్స్ 200 పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. అనంతరం నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 70) విధ్వంసకర బ్యాటింగ్తో లక్నో సునాయసంగా లక్ష్యాన్ని చేధించింది.

లక్నో విజయంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్ ఠాకూర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. నికోలస్ పూరన్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ఈ విజయం వెనుక ఈ ఇద్దరి కంటే లక్నో మెంటార్ జహీర్ ఖాన్ పాత్ర కీలకమని నెటిజన్లు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మెంటార్గా జహీర్ ఖాన్ రచించిన వ్యూహాలు అద్భుతమని కొనియాడుతున్నారు.
లక్నో బౌలింగ్ విభాగం బలహీనంగా ఉండటంతో సన్రైజర్స్ హైదరాబాద్ సునాయసంగా 300 పరుగులు చేస్తుందని మ్యాచ్ ముందు అంతా అనుకున్నారు. కానీ లక్నో బౌలర్లు అద్భుతమైన బౌలింగ్తో సన్రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. వారి బలహీనతలకు తగ్గట్లు బౌలింగ్ చేయడంలో సఫలమయ్యారు. ఓ బౌలర్గా జహీర్ ఖాన్.. సన్రైజర్స్ బ్యాటర్లకు అనుగుణంగా ప్రణాళికలు రచించాడు. ఫుల్లర్ లెంగ్త్ డెలివరీలతో సన్రైజర్స్ టాప్ బ్యాటర్లను కట్టడి చేశాడు. దూకుడే మంత్రంగా ఆడుతున్న వారికి అదే రీతిలో బౌలింగ్ చేసి బుట్టలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే లక్నో అన్సంగ్ హీరో జహీర్ ఖాన్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.