హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సత్తా చాటారు. హెన్రీచ్ క్లాసెన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 47), అబ్దుల్ సమద్(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 37 నాటౌట్) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది.
లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. యుధ్వీర్ సింగ్, ఆవేశ్ ఖాన్, యశ్ థాకూర్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీసారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్కు మరోసారి శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ అభిషేక్ శర్మ(7)ను యుధ్ వీర్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.

క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(20)తో కలిసి అన్మోల్ప్రీత్ సింగ్(36) ధాటిగా ఆడాడు. దాంతో సన్రైజర్స్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని యశ్ థాకూర్ విడదీసాడు. షార్ట్ పిచ్ బాల్తో త్రిపాఠిని కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో సన్రైజర్స్ పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది.
కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్, అన్మోల్ ప్రీత్ సింగ్.. ధాటిగా ఆడుతూ.. రన్రేట్ తగ్గకుండా చూసుకున్నారు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న అన్మోల్ ప్రీత్ సింగ్(36)ను అమిత్ మిశ్రా రిటర్న్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు.
దాంతో బ్యాటింగ్కు వచ్చిన క్లాసెన్ తన ఫామ్ను కొనసాగించాడు. అయితే కృనాల్ పాండ్యా 13వ ఓవర్లో వరుస బంతుల్లో కెప్టెన్ మార్క్రమ్(28)తో పాటు డేంజరస్ గ్లేన్ ఫిలిప్స్(0)ను పెవిలియన్ చేర్చి దెబ్బతీసాడు. అయినా క్లాసెన్-సమద్ ధాటిగా ఆడారు. హాఫ్ సెంచరీకి చేరువైన క్లాసెన్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు.
యశ్ థాకూర్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి మూడు బంతులను డాట్ చేసిన అబ్దుల్ సమద్.. భారీ సిక్సర్ బాదడంతో సన్రైజర్స్ 180 పరుగుల మార్క్ అందుకుంది.