సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల విధ్వంసకర బ్యాటింగ్తో సంచలన విజయాన్ని అందుకున్నామని ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఉప్పల్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గెలిచింది.
166 పరుగులు లక్ష్యాన్ని 62 బంతులు మిగిలి ఉండగానే చేధించి చరిత్ర సృష్టించింది. ఈ విజయానంతరం మాట్లాడిన ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్.. ఓ బౌలర్గా తనను భయపెట్టిందని చెప్పాడు. 'వికెట్ ఏం మారలేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలే తమ విధ్వంసంతో మార్చినట్లున్నారు(నవ్వుతూ).

వారిని స్వేచ్చగా ఆడేలా మేం విడిచిపెట్టాం. ఈ ఇద్దరూ సానుకూలంగా ఉంటారు. ఓ బౌలర్గా నేను వారికి ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వలేను. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ గత రెండేళ్లుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతను కష్టతరమైన గ్యాప్స్లోకి బంతిని కొడుతున్నాడు. అద్భుతంగా మిడిల్ చేస్తున్నాడు.
అభిషేక్ శర్మ సైతం అద్భుతమైన ఆటగాడు. స్పిన్, పేస్ను సమర్థవంతంగా ఆడగలడు. పవర్ ప్లేలో ఇద్దరి ఫీల్డర్లను మాత్రమే సర్కిల్ బయటపెట్టి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలకు బౌలింగ్ చేయడం చాలా కష్టం. ఈ ఇద్దరి విధ్వంసమే మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం. బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నప్పుడు వారిని ఔట్ చేయడం బౌలర్లకు చాలా కష్టం.
ఓ బౌలర్గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల బ్యాటింగ్ భయపెట్టింది. మా జట్టుకు ఇదో అద్భుతమైన సీజన్. ఇక 10 ఓవర్లలోపే విజయాన్నందుకోవడం నమ్మశక్యంగా లేదు.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోని(30 బంతుల్లో 9 ఫోర్లతో 55), నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 48) దూకుడుగా ఆడారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/12) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే 167 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 75 నాటౌట్), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లతో 89 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు.