హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్-సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ డగౌట్పైకి హైదరాబాద్ అభిమానులు నట్లు, బోల్టులను విసిరికొట్టారు. దాంతో మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయింది.
ఆవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో హైదరాబాద్ అభిమానులు కోహ్లీ కోహ్లీ అని బిగ్గరగా అరవడం వినిపించింది. కోహ్లీతో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్, పేసర్ నవీన్ ఉల్ హక్ పెట్టుకున్న గొడవ నేపథ్యంలోనే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నోబాల్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని నిరసిస్తూ నట్లు, బోల్డ్లు విసిరినట్లు అర్థమవుతోంది.

19వ ఓవర్ మూడో బంతిని ఆవేశ్ ఖాన్ హైఫుల్ టాస్గా వెయగా.. ఫీల్డ్ అంపైర్ నోబాల్గా ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ సవాల్ చేసింది. దాంతో రివ్యూలు పరిశీలించిన థర్డ్ అంపైర్.. బ్యాటర్ వంగాడని, నోబాల్ కాదని తెలిపాడు. ఈ నిర్ణయంతో క్లాసెన్ సహా అబ్దుల్ సమద్లు షాకయ్యారు. వాస్వానికి నడుముపై నుంచి బంతి వెళితే నోబాల్ ఇస్తారు. క్లియర్గా నోబాల్ అని తెలుస్తున్నా థర్డ్ అంపై కాదని చెప్పడం అందరికి ఆగ్రహం తెప్పించింది. కామెంటేటర్లు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
అంపైర్ తప్పుడు నిర్ణయంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సన్రైజర్స్ అభిమానులు.. లక్నో డగౌట్ వైపు నట్లు, బౌల్ట్లను విసిరారు. దాంతో మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయింది. మైదానంలో ఉన్న బోల్డ్లనే విసిరికొట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 47), అబ్దుల్ సమద్(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 37 నాటౌట్) రాణించగా.. అన్మోల్ ప్రీత్ సింగ్(27 బంతుల్లో 7 ఫోర్లతో 36), రాహుల్ త్రిపాఠి(13 బంతుల్లో 4 ఫోర్లతో 20), ఎయిడెన్ మార్క్రమ్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 28) పర్వాలేదనిపించారు.
లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. యుధ్వీర్ సింగ్, ఆవేశ్ ఖాన్, యశ్ థాకూర్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీసారు.