ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 166 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. ఆయుష్ బదోని(30 బంతుల్లో 9 ఫోర్లతో 55), నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 48) విధ్వంసకర బ్యాటింగ్తో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్తో 29), కృనాల్ పాండ్యా(21 బంతుల్లో 2 సిక్స్లతో 24) పరిస్థితులకు తగ్గట్లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/12) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

నిప్పులు చెరిగిన భువీ..
స్లో వికెట్పై ఇదే పోరాడే లక్ష్యమే. భువనేశ్వర్ కుమార్ కట్టుదిట్టమైన బౌలింగ్కు లక్నో సూపర్ జెయింట్స్ 11.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 66 పరుగులే చేసింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ఆయుష్ బదోని, నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. నటరాజన్ వేసిన 14 ఓవర్లో బదోని మూడు ఫోర్లతో 17 పరుగులు చేయగా.. కమిన్స్ వేసిన 15వ ఓవర్లో పూరన్ ఓ సిక్స్ బాది 12 పరుగులు పిండుకున్నాడు.
ఇక్కడి నుంచి లక్నో ధాటిగా ఆడింది. కమిన్స్ వేసిన 16వ ఓవర్లో 10 పరుగులు రాగా.. నటరాజన్ వేసిన 17వ ఓవర్లో 14 రన్స్ వచ్చాయి. 18వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ 5 పరుగులే ఇచ్చి లక్నో జోరుకు బ్రేక్ వేసాడు. కానీ నటరాజన్ వేసిన 19వ ఓవర్లో 15, కమిన్స్ వేసిన ఆఖరి ఓవర్లో 19 పరుగులు రావడంతో లక్నో సూపర్ జెయింట్స్ 165 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది.

ఆఖరి ఓవర్ను కమిన్స్ కట్టుదిట్టంగా వేసినా లక్నో 150 పరుగుల మార్క్ కూడా అందుకునేది కాదు. కమిన్స్ ఆఖరి ఓవర్ మ్యాచ్ మూమెంటమ్ను మార్చింది.