
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు శుభారంభం దక్కలేదు. మరోవైపు సమష్టిగా చెలరేగిన కోల్కతా నైట్రైడర్స్ అద్భుతవిజయంతో ఈ సీజన్ను మొదలుపెట్టింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో హైదరాబాద్ను కట్టడి చేసిన కోల్కతా 10 పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. నితీష్ రాణా(55 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్స్లతో 80 నాటౌట్), రాహుల్ త్రిపాఠి(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో దుమ్ములేపారు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్, మహ్మద్ నబీ రెండేసి వికెట్లు తీయగా.. నటరాజన్, భువీ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 రన్స్ చేసింది. జానీ బెయిర్ స్టో(40 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్లతో 55), మనీష్ పాండే(44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 61 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించినా.. చివర్లో అబ్దుల్ సమద్ (8 బంతుల్లో 2 సిక్స్లతో 19 నాటౌట్) చెలరేగినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్, ఆండ్రూ రస్సెల్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీశారు.
నో గుడ్ స్టార్ట్..
అంతకుముందు 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు శుభారంభం దక్కలేదు. ఆదిలోనే ఓపెనర్లు డేవిడ్ వార్నర్(3), వృద్దీమాన్ సాహా(7) వికెట్లను కోల్పోయింది. ప్రసిధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్లోనే డేవిడ్ వార్నర్ కీపర్ క్యాచ్గా వెనుదిరగ్గా.. షకీబ్ వేసిన ఆ మరుసటి ఓవర్లో సాహా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో హైదరాబాద్ 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జానీ బెయిర్ స్టో, మనీష్ పాండే ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దాంతో హైదరాబాద్ పవర్ ప్లే ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 35 రన్స్ చేసింది.
బెయిర్ స్టో హాఫ్ సెంచరీ..
అనంతరం మరింత చెలరేగిన ఈ జోడీ.. స్నిన్నర్లనే టార్గెట్గా విరుచుపడింది. ఈ క్రమంలో 32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో బెయిర్ స్టో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే జోరు మీదున్న ఈ జోడీని కమిన్స్ విడదీసాడు. అతని బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన బెయిర్ స్టో నితీష్ రాణా చెతికి చిక్కాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మహ్మద్ నబీ(11 బంతుల్లో 2 ఫోర్లతో 14) దూకుడుగా ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
ఆకట్టుకున్న సమద్..
తర్వాత క్రీజులోకి విజయ్ శంకర్ రాగా.. మనీష్ పాండే 37 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే చేజింగ్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెరిగింది ఈ క్రమంలోనే విజయ్ శంకర్(11) వెనుదిరిగాడు. ఇక కమిన్స్ బౌలింగ్లో అబ్దుల్ సమద్ రెండు భారీ సిక్సర్లతో ఆశలు రేకెత్తించినా.. ఆండ్రూ రస్సెల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్కు ఓటమి తప్పలేదు.