
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న తమ ఫస్ట్ లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ దుమ్మురేపారు. ఆ జట్టు ఓపెనర్ నితీష్ రాణా(55 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్స్లతో 80 నాటౌట్), ఫస్ట్ డౌన్ బ్యాట్స్మన్ రాహుల్ త్రిపాఠి(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో పరుగుల విధ్వంసం సృష్టించారు.
దాంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్, మహ్మద్ నబీ రెండేసి వికెట్లు తీయగా.. నటరాజన్, భువీ తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్కు మంచి శుభారంభం దక్కింది. ఆరంభం నుంచే ఓపెనర్లు నితీష్ రాణా, శుభ్మన్ గిల్(15) బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 50 రన్స్ చేసింది. అనంతరం ఓపెనర్ శుభ్మన్ గిల్(15) ఔటైనా.. రాహుల్ త్రిపాఠితో రాణా దూకుడును కొనసాగించాడు.
ఈ ఇద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. సన్రైజర్స్ బౌలర్లను చెడుగుడు ఆడారు. దాంతో ఓ దశలో కేకేఆర్ 200కు పైగా పరుగులు చేస్తుందా? అనిపించింది. కానీ నటరాజన్.. రాహుల్ త్రిపాఠిని ఔట్ చేసి వీరి జోరుకు బ్రేక్ వేశాడు. దాంతో సెకండ్ వికెట్కు నమోదైన 93 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత నబీ వరుస బంతుల్లో నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్(2) పెవిలియన్ చేర్చి భారీ స్కోర్కు అడ్డుకట్టవేశాడు.
కానీ భువనేశ్వర్ వేసిన చివరి ఓవర్లో దినేశ్ కార్తీక్(9 బంతుల్లో 2 ఫోర్లు సిక్స్తో 22 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ 187 రన్స్ చేసింది. ఇక హైదరాబాద్ బౌలర్లంతా విఫలమైన వేళ..రషీద్ ఖాన్(2/24) ఆకట్టుకున్నాడు. చివర్లో మహ్మద్ నబీ(2/32), భువనేశ్వర్ కుమార్(1/45), నటరాజన్(1/37) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేకేఆర్ 200 ప్లస్ స్కోర్ చేయలేకపోయింది.