హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు మరో పరాజయం ఎదురైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో పేలవ బ్యాటింగ్తో మూల్యం చెల్లించుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్లో 9 పరుగులు చేయలేక ఓటమికి తల ఒంచింది. మరోవైపు సూపర్ బౌలింగ్తో కేకేఆర్.. హైదరాబాద్పై రివేంజ్ తీర్చుకుంది. ఆఖరి ఓవర్లో అబ్దుల్ సమద్ ఔటవ్వడం సన్రైజర్స్ ఓటమిని శాసించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 42), రింకూ సింగ్(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 46) రాణించారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, మార్కో జాన్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగీ, ఎయిడెన్ మార్క్రమ్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్(40 బంతుల్లో 4 ఫోర్లతో 41), హెన్రీచ్ క్లాసెన్(20 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 36) రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తీ మూడు పరుగులు మాత్రమే ఇచ్చి కేకేఆర్ను గెలిపించాడు.
శుభారంభం లేదు:లక్ష్యచేధనలో సన్రైజర్స్ హైదరాబాద్కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్(18)ను హర్షిత్ రాణా పెవిలియన్కు చేర్చాడు. ఆ వెంటనే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో అభిషేక్ శర్మ(9) క్యాచ్ ఔటయ్యాడు. ఆండ్రీ రస్సెల్ స్టన్నింగ్ క్యాచ్తో నిరాశగా వెనుదిరిగాడు.
బ్రూక్ మళ్లీ విఫలం: క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన రాహుల్ త్రిపాఠి ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. మూడు బౌండరీలు, సిక్స్తో కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కానీ అతని జోరుకు రస్సెల్ బ్రేక్ వేయడంతో సన్రైజర్స్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. అనంతరం అనుకుల్ రాయ్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్(0) డకౌట్గా వెనుదిరిగాడు.
ఆదుకున్న క్లాసెన్: ఈ పరిస్థితుల్లో హెన్రీచ్ క్లాసెన్, మార్క్రమ్ జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్కు 70 పరుగులు జోడించిన అనంతరం భారీ షాట్ ఆడే ప్రయత్నంలో హెన్రీచ్ క్లాసెన్ పెవిలియన్ చేరాడు. క్లాసెన్ ఔటైనా.. మార్క్రమ్ ఆచితూచి ఆడాడు. హాఫ్ సెంచరీకి చేరవైన అతన్ని వైభవ్ అరోరా ఔట్ చేశాడు. 12 బంతుల్లో సన్రైజర్స్ విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. మార్కో జాన్సెన్ను వైభవ్ అరోరా పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన భువీ ఓ బౌండరీ బాదగా.. అబ్బుల్ సమద్ మరో బౌండరీ కొట్టాడు. దాంతో ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. అబ్దుల్ సమద్ భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔటవ్వడంతో మ్యాచ్ కేకేఆర్ వైపు మళ్లింది. చివరి ఓవర్లో వరుణ్ చక్రవర్తీ 3 పరుగులు మాత్రమే ఇచ్చి సన్రైజర్స్ పతనాన్ని శాసించాడు.