
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా రెండో ఫైనల్ బెర్త్ ఎవరిదో తేల్చుకునేందుకు శుక్రవారం కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడుతున్నాయి. ఫైనల్కు వెళ్లాలంటే తప్పగ గెలవాల్సిన ఈ మ్యాచ్లో శాయశక్తులు ఒడ్డేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం చెన్నైతో ఫైనల్లో తలపడనుంది.
ఇదిలా ఉంటే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ విలియమ్సన్ చెప్పాడు. మనీష్ పాండే, శ్రీవాత్స్ గోస్వామి, సందీప్ శర్మ స్థానాల్లో హుడా, సాహా, ఖలీల్ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్
మరోవైపు కోల్కతా జట్టులో ఒక్క మార్పు మాత్రమే జరిగింది. జావన్ సీర్లెస్ స్థానంలో శివమ్ మావిని తీసుకున్నట్లు దినేష్ కార్తీక్ వెల్లడించాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో గెలవాలంటే ఏం చేయాలో కోల్కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్కు ఢిల్లీ డేర్ డెవిల్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఓ సలహా ఇచ్చాడు.
2011లో సౌరవ్ గంగూలీ ఆ సలహా తనకు ఇచ్చాడని, ఇప్పుడు దానిని దినేశ్ కార్తీక్కు ఇస్తున్నట్టు గంభీర్ చెప్పాడు. ఆ రోజు గంగూలీ ఇచ్చిన సలహాను పాటించే తాను విజయం సాధించానని ఈ సందర్భంగా గంభీర్ చెప్పుకొచ్చాడు. అందులో మొదటి ట్రిక్ ఈడెన్ గార్డెన్స్లోని ప్రేక్షకులను తనవైపు తిప్పుకోవడమేనని అన్నాడు.
ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఎదుర్కొన్నప్పుడు, తాను కూడా చాలా నెర్వస్గా ఫీలయ్యానని గంభీర్ తెలిపాడు. ప్రేక్షకుల మధ్య ఆడాలంటే తనకు కొంత ఇబ్బందిగా ఉండేదని, తాను థియేట్రికల్ టైప్ కాదని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాబట్టి తొలుత ప్రేక్షకుల మనసులు దోచుకుంటే, వారిని తనవైపు తిప్పుకుంటే సగం విజయం సాధించినట్టేనని గంభీర్ తెలిపాడు.
కాగా లీగ్ దశలో మూడు, ప్లేఆఫ్స్లో ఒక మ్యాచ్ ఓటమితో సతమతమవుతున్న సన్రైజర్స్ జట్టు ఈ మ్యాచ్లో గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్స్కి దూసుకెళ్లాలని కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఉవ్విళ్లూరుతోంది. కోల్కతా నైట్రైడర్స్ సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో కోల్కతా జట్టు ఫేవరేట్గా బరిలోకి దిగుతుంది.