ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తేలిపోయారు. లోకల్ భాయ్ మహమ్మద్ సిరాజ్(4/17) ధాటికి ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. సిరాజ్ దెబ్బకు ట్రావిస్ హెడ్(8), అభిషేక్ శర్మ(18) పవర్ ప్లేలోనే వెనుదిరగ్గా.. డెత్ ఓవర్లో అనికేత్ వర్మ(18), సిమర్జిత్ సింగ్(0) ఔటయ్యారు.
మరోసారి పవర్ ప్లేలోనే సన్రైజర్స్ హైదరాబాద్ కీలక వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్ వైఫల్యంతో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలై వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్కు హాజరైన సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్.. తమ బ్యాటర్ల వైఫల్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డగౌట్లో చాలా నిరాశగా కనిపించింది.

కావ్య పాప అసహనం..
ముఖ్యంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్లు పేలవ షాట్లతో పెవిలియన్ చేరడంతో కావ్య మారన్ తీవ్ర అసహనానికి గురైంది. 'మీకు ఏం పుట్టింది..రా అయ్యా.. ఒక్కడైనా సరిగ్గా ఆడటం లేదు' అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మ్యాచ్ ఆసాంతం తీవ్ర బాధలో కనిపించింది. కావ్యమారన్ రియాక్షన్స్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
గతేడాది సన్రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో ఎగిరి గంతేసిన కావ్య మారన్.. ఈ సీజన్ను విధ్వంసకర బ్యాటింగ్తో ఘనంగా ప్రారంభించడంతో తెగ సంతోషం వ్యక్తం చేసింది. కానీ తర్వాతి నాలుగు మ్యాచ్ల్లో సన్రైజర్స్ దారుణంగా విఫలమవడంతో తీవ్ర ఆవేదనకు గురైంది. కావ్య మారన్తో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కూడా తీవ్ర బాధకు గురవుతున్నారు. చెత్త బ్యాటింగ్తో ఐపీఎల్ క్వీన్ అయిన కావ్య మారన్ మనసును నొప్పిస్తున్నారని మండిపడుతున్నారు. కావ్య పాప ముఖంలో చిరు నవ్వు మాయమైందని కామెంట్ చేస్తున్నారు.
దెబ్బతీసిన సిరాజ్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి(34 బంతుల్లో 3 ఫోర్లతో 31), హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. ప్యాట్ కమిన్స్(9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/17) నాలుగు వికెట్లతో సన్రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్మన్ గిల్(43 బంతుల్లో 9 ఫోర్లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 49), షెర్ఫేన్ రూథర్ఫోర్డ్(16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సన్రైజర్స్ బౌలర్లలో మహమ్మద్ షమీ(2/28) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు.