ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లోనూ సన్రైజర్స్ బ్యాటర్లు తేలిపోయారు. లోకల్ భాయ్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి(34 బంతుల్లో 3 ఫోర్లతో 31), హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. ప్యాట్ కమిన్స్(9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/17) నాలుగు వికెట్లతో సన్రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు తీసాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. లోకల్ భాయ్ మహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్లోనే రెండు వరుస బౌండరీలతో దూకుడు కనబర్చిన ట్రావిస్ హెడ్.. చివరి బంతికి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్(17)తో అభిషేక్ శర్మ(18) దూకుడుగా ఆడాడు. కానీ అతని దూకుడుకు సిరాజ్ బ్రేక్ వేసాడు. క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలోనే సన్రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. ఆచితూచి ఆడుతున్న ఇషాన్ కిషన్(17)ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు.

బ్యాటింగ్కు వచ్చిన హెన్రీచ్ క్లాసెన్(27) దూకుడుగా ఆడాడు. మరో ఎండ్లో నితీష్ ఆచితూచి ఆడినా క్లాసెన్ తనదైన షాట్లతో అలరించాడు. 50 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని సాయి కిషోర్ విడదీసాడు. స్టన్నింగ్ డెలివరీతో క్లాసెన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్లోనే నితీష్ కుమార్ రెడ్డి(31)ని కూడా సాయి కిషోర్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి సన్రైజర్స్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కామిందు మెండీస్(1) తీవ్రంగా నిరాశపర్చగా.. అనికేత్ వర్మ(18)ను సిరాజ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. సిమర్జిత్ సింగ్ను క్లీన్ బౌల్డ్ చేసి సిరాజ్ తన ఖాతాలో నాలుగో వికెట్ వేసుకున్నాడు. క్రీజులోకి వచ్చిన షమీ సాయంతో ప్యాట్ కమిన్స్ జట్టు స్కోర్ను 150 పరుగులు ధాటించాడు.