హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఉప్పల్ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్(3/28) రఫ్ఫాడించాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది.
అక్షర్ పటేల్(34 బంతుల్లో 4 ఫోర్లతో 34), మనీశ్ పాండే(27 బంతుల్లో 2 ఫోర్లతో 34) మినహా అంతా విఫలమయ్యారు. సన్రైజర్స్ బౌలర్లలో సుందర్ మూడు వికెట్లు తీయగా.. భువీ రెండు వికెట్లు పడగొట్టారు. నటరాజన్కు ఓ వికెట్ దక్కింది.

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్(0) గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. పృథ్వీ షాను కాదని ఫిల్ సాల్ట్ను ఓపెనర్గా ఆడించినా ఢిల్లీ రాత మారలేదు. క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్.. మార్కో జాన్సెన్ బౌలింగ్లో వరుసగా 4 బౌండరీలు బాది జోరు కనబర్చాడు.
నాలుగో ఓవర్లో నటరాజన్ అతని జోరుకు కళ్లెం వేసాడు. ఎల్బీగా మిచెల్ మార్ష్ను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఢిల్లీ పవర్ ప్లేలో 2 వికెట్లకు 49 పరుగులు చేసింది. అయితే వాషింగ్టన్ సుందర్ 8వ ఓవర్లో ఢిల్లీకి ట్రిపుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో డేవిడ్ వార్నర్(21), సర్ఫరాజ్ ఖాన్(10), ఆమన్ హకీమ్ ఖాన్(4)లను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఢిల్లీ 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో మనీష్ పాండే, అక్షర్ పటేల్ నిదానంగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీలు చిక్కిన బంతిని బౌండరీ బాదిన ఈ జోడీ
ఆరో వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇక క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని భువనేశ్వర్ కుమార్ విడదీసాడు.
అక్షర్ పటేల్(34)ను క్లీన్ బౌల్డ్ చేయగా.. మనీశ్ పాండే(34)ను సుందర్ స్టన్నింగ్ త్రో సాయంతో రనౌట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన అన్రిచ్ నోర్జ్, రిపల్ పటేల్ రనౌటవ్వగా.. కుల్దీప్ యాదవ్ బౌండరీ బాది జట్టు స్కోర్ను 140 పరుగులు ధాటించాడు.