ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ప్రస్తుతం ఉప్పల్లో భారీ వర్షం పడుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేసే సమయానికి వర్షం రావడంతో మైదాన సిబ్బంది గ్రౌండ్ను కవర్లతో కప్పేసారు. వర్షం భారీగా పడుతుండటంతో మైదానంలో నీరు భారీగా చేరింది. ఒకవేళ వర్షం తగ్గినా మ్యాచ్ పున:ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు మాత్రమే చేసింది. ట్రిస్టన్ స్టబ్స్(36 బంతుల్లో 4 ఫోర్లతో 41 నాటౌట్), అషుతోష్ శర్మ(26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 41) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3/19) మూడు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. జయదేవ్ ఉనాద్కత్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీసారు. ప్యాట్ కమిన్స్ సంచలన ప్రదర్శనతో సన్రైజర్స్ టీమ్ ఓనర్ కావ్య మారన్ సంతోషంతో ఎగిరి గంతేసింది.

ఢిల్లీని తక్కువ స్కోర్కు పరిమితం చేసిన సన్రైజర్స్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తుందని భావించిన అభిమానులకు వర్షం రూపంలో ఊహించని షాక్ తగిలింది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే చెరో పాయింట్ కేటాయించనున్నారు. అదే జరిగితే సన్రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోనుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారనున్నాయి. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ 6 విజయాలు 12 పాయింట్స్తో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ రద్దయితే ఒక పాయింట్ చేరుతోంది. అప్పుడు ఆ జట్టు ఖాతాలో 13 పాయింట్స్ చేరుతాయి. ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి మూడు మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ జరిగి సన్రైజర్స్ గెలిచినా.. ఢిల్లీ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోంది.