
పుణే: చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య పగ్గాలను మళ్లీ మహేంద్రసింగ్ ధోనీ స్వీకరించిన వేళా విశేషమో ఏమో కానీ.. ఆ జట్టు దుమ్మురేపింది. వరుస పరాజయాలతో చతికిలపడ్డ సీఎస్కే విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 99), డేవాన్ కాన్వే(55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 నాటౌట్) భారీ ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ సీజన్లో దారుణంగా విఫలమైన రుతురాజ్ ఈ మ్యాచ్లో తన సత్తా ఏంటో చూపించాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. కాన్వేతో కలిసి తొలి వికెట్కు 182 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగులు చేసింది. ఈ ఇద్దరి ధాటికి సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. నటరాజన్ ఒక్కడే రెండు వికెట్లు తీసాడు. మహేంద్ర సింగ్ ధోనీ(8) విఫలమవ్వగా.. రవీంద్ర జడేజా(1 నాటౌట్) అజేయంగా నిలిచాడు.
ఈ మ్యాచ్కు ముందు రవీంద్ర జడేజా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని ధోనీకి అప్పజెప్పాడు. కెప్టెన్సీ భారం కారణంగా వ్యక్తిగత ప్రదర్శన దెబ్బతినడంతో జడేజా ఈ నిర్ణయం తీసుకున్నాడని సీఎస్కే యాజమాన్యం వెల్లడించింది. వ్యక్తిగత ప్రదర్శనపై మరింత ఫోకస్ పెట్టేందుకే జడేజా ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిపింది. ధోనీ కెప్టెన్గా బరిలోకి దిగడంతో చెన్నై దరిద్రమంతా అదృష్టంగా మారింది. దారుణంగా విఫలమైన రుతురాజ్, కాన్వేలు ఊహించని రీతిలో చెలరేగారు. ఇటీవల ఓ ఇంటివాడైన కాన్వే.. బ్రేక్ అనంతరం ఆడుతున్న తొలి మ్యాచ్లోనే సత్తా చాటాడు.