ముంబై: కరోనా పాజిటివ్ అని తెలియగానే తాను వణికిపోయానని సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ వృద్దిమాన్ సాహా తెలిపాడు. తన కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురయ్యారన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలో సాహాని ప్రయోగాత్మక ఓపెనర్గా ఆడించిన సన్రైజర్స్ హైదరాబాద్.. అతను దారుణంగా విఫలమవడంతో జట్టు నుంచి తప్పించి బెంచ్కే పరిమితం చేసింది. అయితే.. బెంచ్పై ఉన్నప్పటికీ.. సాహా వైరస్ బారినపడ్డాడు. సాహాకు కరోనా పాజిటివ్గా తేలిన నిమిషాల్లోనే ఐపీఎల్ 2021 సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది.
ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న సాహా ఆనంద్ బజార్ పత్రికతో తన ఆరోగ్యం గురించి అప్డేట్ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'కరోనా పాజిటివ్గా తేలగానే చాలా భయపడిపోయా. నేనే కాదు.. నా ఫ్యామిలీ మొత్తం ఆందోళనకి గురయ్యారు. అది తెలిసి నేనే నా ఫ్యామిలీకి వీడియో కాల్ చేసి వారికి నా ఆరోగ్యం బాగానే ఉందని.. మీరు ఆందోళన చెందొద్దని చెప్పాను. కాగా ఐపీఎల్ సందర్భంగా ప్రాక్టీస్ ముగించుకుని హోటల్కి వచ్చిన తర్వాత జలుబు, దగ్గు రావడంతో టీమ్ డాక్టర్కి సమాచారం అందించాను. ఆరోజే క్వారంటైన్లో ఉంచి.. నాకు కరోనా పరీక్ష చేశారు. వెంటనే నన్ను ఐసోలేషన్కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది' అని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2021 సీజన్లో రెండు మ్యాచ్లాడిన సాహా కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. షెడ్యూల్ ప్రకారం 60 మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. టోర్నీ వాయిదా వరకూ 29 మ్యాచ్లు ముగిశాయి. దాంతో.. మిగిలిన 31 మ్యాచ్ల్ని సెప్టెంబరు- అక్టోబరులో నిర్వహించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ క్రికెటర్లు ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచ్లు ఆడబోరని వార్తలు వస్తుండటంతో.. జానీ బెయిర్స్టో స్థానంలో వికెట్ కీపర్/ ఓపెనర్గా సాహా ఆడే అవకాశం ఉంది. ఇక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఎంపిక చేసిన జంబో జట్టులో సాహా చోటు దక్కించుకున్నాడు. కాకపోతే ఈ పర్యటనకు ముందు అతను ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.