సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా మరోసారి దుమ్మురేపాడు. ఐపీఎల్ 2021 వాయిదా కారణంగా వచ్చిన విరామాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్న ఈ విధ్వంసకర బ్యాట్స్మెన్.. స్పూఫ్ వీడియోలను మళ్లీ మొదలుపెట్టాడు. భారత్ అన్నా.. తెలుగు ప్రజలు అన్నా విపరీతమైన అభిమానం చూపించే వార్నర్.. ఇప్పటికే ఎన్నో తెలుగు పాటలకు చిందేస్తూ, డైలాగ్స్ చెబుతూ అభిమానులను అలరించిన విషయం తెలిసిందే.
ఇటీవల వీటికి కొంత గ్యాప్ ఇచ్చిన ఈ ఆసీస్ స్టార్ మళ్లీ షురూ చేసిండు. తాజాగా టైగర్ ష్రాప్ నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలోని పాటకు స్టెప్పులేసిన స్పూఫ్ వీడియోను ఇన్స్టా వేదికగా పంచుకున్నాడు. స్వాపింగ్ యాప్తో టైగర్ ష్రాఫ్ ముఖానికి బదులుగా తన ముఖాన్ని స్వాప్ చేసిన వార్నర్.. అలియా బట్తో కలిసి చిందేసాడు. 'ఇదంతా నా అభిమానుల డిమాండ్ మేరకే'అంటూ క్యాప్షన్గా రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. వారం క్రితం తెలుగులో సతీమణికి ట్వీట్ చేసిన వార్నర్.. ఆ తర్వాత అభిమానులకు స్పష్టమైన తెలుగులోనే ధన్యవాదాలు తెలిపాడు. ఈ రెండు ట్వీట్లు తెలుగు ప్రజలను సంతోషపెట్టాయి.
ఇక ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా రద్దు కావడంతో స్వదేశానికి చేరుకున్న వార్నర్ అక్కడ మరో 15రోజుల పాటు సిడ్నీలోని హోటల్లో కఠిన క్వారంటైన్లో గడిపాడు. ఇటీవలే ఐసోలేషన్ పూర్తి చేసుకున్న ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను కలుసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో ఆటగాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఆస్ట్రేలియా జట్టు జూలైలో వెస్టిండీస్లో పర్యటించనుంది. విండీస్తో ఐదు టీ20ల సిరీస్తో పాటు మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు రానుంది. ఈ క్రమంలో ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్లు ఆడటం అనుమానంగా మారింది.