ఐపీఎల్ 2024 సీజన్లో వరుసగా రెండు పరాజయాలతో ఢీలా పడిన సన్రైజర్స్ హైదరాబాద్ మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. రాజస్థాన్ రాయల్స్తో గురువారం ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనుంది. ప్లే ఆఫ్స్ సమరం రసవత్తరంగా మారిన పరిస్థితుల్లో ఈ మ్యాచ్ గెలవడం సన్రైజర్స్ హైదరాబాద్కు కీలకం.
సంచలన బ్యాటింగ్తో వరుస విజయాలతో జోరు కనబర్చిన సన్రైజర్స్ హైదరాబాద్.. గత రెండు మ్యాచ్ల్లో బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిపాలైంది. ఆర్సీబీ చేతిలో 38 పరుగుల తేడాతో ఓడిన సన్రైజర్స్.. చెన్నై చేతిలో 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఛేజింగ్లో ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు అనవసర ఒత్తిడికి గురవుతున్నారు.

రాజస్థాన్ జోరు..
ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని కమిన్స్ సేన పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకు వేయాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది.
మరోవైపు వరుస విజయాలతో టేబుల్ టాపర్గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకుంది. సన్రైజర్స్ను ఓడించి అధికారికంగా ప్లే ఆఫ్స్ చేరాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఈ మ్యాచ్ కూడా రసవత్తరంగా జరగనుంది.

మార్క్రమ్ మామపై వేటు..
సన్రైజర్స్ హైదరాబాద్ తమ తుది జట్టులో పలు మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడుతున్న ఎయిడెన్ మార్క్రమ్ను పక్కన పెట్టే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన మార్క్రమ్.. 18, 42*, 17, 50*, 0, 32*, 1, 7, 32లతో 207 పరుగులే చేశాడు.
ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. ఈ క్రమంలోనే అతనిపై వేటు వేసి న్యూజిలాండ్ ఆల్రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. గత మ్యాచ్కు దూరమైన మయాంక్ మార్కండే సైతం తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు మార్పులు మినహా మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. నటరాజన్, ట్రావిస్ హెడ్ల్లో ఒకరు తుది జట్టులో ఉంటే మరొకరు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడనున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా):
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్/గ్లేన్ ఫిలిప్స్, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, షెహ్బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కత్/వాషింగ్టన్ సుందర్
ఇంపాక్ట్ ప్లేయర్: నటరాజన్