హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో గురువారం ఉప్పల్ వేదికగా జరుగనున్న నామమాత్రపు మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సన్రైజర్స్ విజయాలతో ఈ సీజన్ను మెరుగ్గా ముగించాలనుకుంటోంది.
ఈ మ్యాచ్ గెలవడమే కాకుండా తమతో పాటు ఆర్సీబీని ఇంటికి తీసుకెళ్లాలని భావిస్తోంది. మరోవైపు ఆర్సీబీకి ఇది డూఆర్డై మ్యాచ్. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి. ఓడితే మాత్రం ఇంటిదారి పట్టాల్సిందే. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన గత మ్యాచ్లో సంచలన ప్రదర్శన కనబర్చిన ఆర్సీబీ 112 పరుగుల భారీ తేడాతో గెలిచి అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది.

ఇదే జోరులో సన్రైజర్స్ను చిత్తు చేసి ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రం బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనుకుంటోంది. గత మ్యాచ్లో గ్లేన్ ఫిలిప్స్పై వేటు వేసిన సన్రైజర్స్.. సన్వీర్ సింగ్కు అవకాశం కల్పించింది. కానీ అతను దారుణంగా విఫలమయ్యాడు.
ఈ క్రమంలోనే రూ.13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్కు మరో అవకాశం ఇవ్వాలని టీమ్మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అతను జట్టులోకి వస్తే ఫజలక్ ఫరూఖీ బెంచ్కే పరిమితం కానున్నాడు. అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్ బరిలోకి దిగవచ్చు. సన్వీర్ సింగ్ను కూడా పక్కనపెట్టవచ్చు. దారుణంగా విఫలమైన మయాంక్ అగర్వాల్ మరోసారి బెంచ్కే పరిమితం కానుండగా.. అన్మోల్ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనున్నారు.
రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రీచ్ క్లాసెన్ మిడిలార్డర్ బాధ్యతలు పంచుకోనున్నారు. బ్రూక్కు మరో అవకాశం ఇస్తే అతను మిడిలార్డర్లో ఆడనున్నాడు. నటరాజన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోనున్నారు. భువనేశ్వర్ కుమార్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. మయాంక్ మార్కండే స్పిన్నర్గా ఆడనున్నాడు.
ఆర్సీబీతో సన్రైజర్స్ తుది జట్టు(అంచనా)
అన్మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, హ్యారీ బ్రూక్/ గ్లేన్ ఫిలిప్స్, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్/వివ్రాంత్ శర్మ/ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే
ఇంపాక్ట్ ప్లేయర్: టీ నటరాజన్