ఐపీఎల్ 2025 సీజన్లో వరుసగా నాలుగు పరాజయాల తర్వాత విజయాన్నందుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గురువారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనుంది. పంజాబ్ కింగ్స్తో ఉప్పల్ వేదికగా జరిగిన హైస్కోరింగ్ గేమ్లో 245 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి విజయాన్నందుకు సన్రైజర్స్ హైదరాబాద్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. గత ఐదు మ్యాచ్ల్లో విఫలమైన అభిషేక్ శర్మ.. విధ్వంసకర శతకంతో ఫామ్లోకి వచ్చాడు. ట్రావిస్ హెడ్ సైతం హాఫ్ సెంచరీతో లయను అందుకున్నాడు.
పంజాబ్పై సాధించిన విజయం సన్రైజర్స్ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ముంబై ఇండియన్స్ సైతం వరుస పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్తో అద్భుత విజయాన్నందుకొని గాడిన పడింది. ఉత్కంఠ పోరులో సమష్టిగా రాణించి గెలుపొందింది. దాంతో ఈ పోరు రసవత్తరంగా సాగనుంది. హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరగనుండటం ముంబై ఇండియన్స్కు కలిసొచ్చే అంశం.

జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
సీనియర్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమవ్వడంతో అతని స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ను రూ. 30 లక్షలకు తీసుకుంది. పవర్ హిట్టర్ అయిన స్మరన్.. దేశవాళీ క్రికెట్లో మెరుగైన రికార్డులు ఉన్నాయి. జట్టులో ఫినిషర్ లోటు ఉండటంతోనే ఆరెంజ్ ఆర్మీ.. స్మరన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్మరన్కు ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన అభినవ్ మనోహర్ స్థానంలో స్మరన్ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
మహమ్మద్ షమీపై వేటు..?
వాంఖడే పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో రాహుల్ చాహర్ను తుది జట్టులోకి తీసుకురావచ్చు. అప్పుడు ఓ పేసర్పై వేటు పడే అవకాశం ఉంది. ఇషాన్ మలింగా లేదా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న మహమ్మద్ షమీపై వేటు వేయవచ్చు. గత మ్యాచ్లో షమీ తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి 75 పరుగులిచ్చాడు. ఇషాన్ మలింగా, హర్షల్ పటేల్ మెరుగైన ప్రదర్శన చేశారు. మిగతా లైనప్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా జీషన్ అన్సారీ బరిలోకి దిగుతాడు. ప్యాట్ కమిన్స్తో పాటు హర్షల్ పటేల్, ఇషాన్ మలింగా, షమీలు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఎక్స్ట్రా స్పిన్నర్గా రాహుల్ చాహర్ బరిలోకి దిగితే మాత్రం షమీ, ఇషాన్ మలింగాలో ఒకరు బెంచ్కు పరిమితమవుతారు.
బ్యాటింగ్ లైనప్లో నో ఛేంజ్..
బ్యాటింగ్ లైనప్లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనున్నారు. గత మ్యాచ్ మాదిరి ఈ ఇద్దరూ చెలరేగితే సన్రైజర్స్ హైదరాబాద్కు తిరుగుండదు. ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్ మిడిలార్డర్లో ఆడనున్నారు. అనికేత్ వర్మతో పాటు స్మరన్ రవిచంద్రన్ లోయరార్డ్ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది.
ముంబై ఇండియన్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషాన్ అన్సారీ, ఇషాన్ మలింగా.
ఇంపాక్ట్ ప్లేయర్: స్మరన్ రవిచంద్రన్/రాహుల్ చాహర్