ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్కు సిద్దమైంది. లక్నోసూపర్ జెయింట్స్తో సోమవారం లక్నో వేదికగా జరిగే మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సన్రైజర్స్ హైదరాబాద్.. పరువు కోసం ఆడాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. 11 మ్యాచ్ల్లో 3 విజయాలు మాత్రమే సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్.. పాయింట్స్ టేబుల్లో 8వ స్థానంలో కొసాగుతోంది.
తదుపరి 3 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే పాయింట్స్ టేబుల్లో మెరుగైన స్థానాన్ని అందుకోనుంది. మరోవైపు లక్నో 11 మ్యాచ్ల్లో 5 గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. సన్రైజర్స్పై విజయం సాధించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువవ్వాలని లక్నో భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మహమ్మద్ షమీపై వేటు..
ఈ సీజన్లో పేలవ బౌలింగ్ ప్రదర్శన సన్రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. ముఖ్యంగా రూ. 10 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మహమ్మద్ షమీ తేలిపోయాడు. అతని వైఫల్యం సన్రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఇప్పటికే ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్కు షమీని పక్కనపెట్టిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఈ మ్యాచ్కు కూడా అతన్ని బెంచ్కే పరిమితం చేసే అవకాశం ఉంది.
అతని స్థానంలో జయదేవ్ ఉనాద్కత్ను కొనసాగించి ఎక్స్ట్రా బ్యాటర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించవచ్చు. ఈ సీజన్లో షమీ 9 మ్యాచ్లు ఆడి 11.23 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీసాడు. ఇతర బౌలర్లు కూడా గొప్ప ప్రదర్శన చేయకపోయినా.. అనుభవం కలిగిన షమీ వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది.
సమష్టిగా చెలరేగితేనే..
షమీ స్థానంలో అభినవ్ మనోహర్, స్మరణ్ రవిచంద్రన్, సచిన్ బేబీలో ఒకరు ఎక్స్ట్రా బ్యాటర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఐపీఎల్ బ్రేక్తో స్వదేశం వెళ్లిపోయిన కమిన్స్, ట్రావిస్ హెడ్ తిరిగి వచ్చారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ బ్యాటర్లుగా బరిలోకి దిగనున్నారు. కామిందు మెండిస్ స్పిన్ ఆల్రౌండర్లుగా ఆడనుండగా.. ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
జీషన్ అన్సారీ స్పెషలిస్ట్ స్పిన్నర్గా బరిలోకి దిగనున్నాడు. అన్సారీ వైఫల్యం కూడా సన్రైజర్స్ను దెబ్బతీసింది. బ్యాటర్ల నిలకడలేమి ప్రదర్శన కూడా ఆరెంజ్ ఆర్మీ ఓటమికి కారణమైంది. సమష్టి ప్రదర్శన చేస్తేనే సన్రైజర్స్ హైదరాబాద్కు విజయం దక్కుతుంది. లేదంటే మరో ఘోర పరాజయం తప్పదు. గత మ్యాచ్కు దూరమైన నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇవ్వవచ్చు.
సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కామిందు మెండీస్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్, జీషన్ అన్సారీ.