ఐపీఎల్ 2025 సీజన్లో వరుస పరాజయాలతో చతికిలపడిన సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గురువారం కోల్కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్ను ఘనంగా ప్రారంభించిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాతి రెండు మ్యాచ్ల్లో చిత్తయ్యింది. భారీ స్కోరే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తూ అనవసర షాట్లతో మూల్యం చెల్లించుకుంటుంది. బ్యాటింగ్ వైఫల్యంతో బౌలర్లు పూర్తిగా తేలిపోతున్నారు. కేకేఆర్తో మ్యాచ్లో విజయం సాధించి గెలుపు బాట పట్టాలని సన్రైజర్స్ పట్టుదలతో ఉంది.
మరోవైపు కేకేఆర్ పరిస్థితి కూడా సన్రైజర్స్లానే ఉంది. ఓటమితో ఈ సీజన్ను ప్రారంభించిన ఆ జట్టు.. రాజస్థాన్ రాయల్స్పై ఘన విజయాన్నందుకుంది. కానీ ముంబై ఇండియన్స్తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలోనే సొంతగడ్డపై సన్రైజర్స్ను కట్టడి చేయాలని కేకేఆర్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

300 అంటే మూడినట్లే..
ఢిల్లీ క్యాపిటల్స్తో పరాజయం అనంతరం తుది జట్టులో మార్పులు చేస్తామని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హింట్ ఇచ్చాడు. టీమ్ కాంబినేషన్కు సంబంధించిన ఆప్షన్స్ను పరిశీలిస్తామని చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్ బలహీనతలను అధిగమించేందుకు అవసరమైతే కీలక ఆటగాళ్లను కూడా పక్కనపెడుతామని స్పష్టం చేశాడు. బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉన్నా.. భారీ స్కోర్ చేయాలనే ఆలోచనలతో అనవసర షాట్లతో సన్రైజర్స్ మూల్యం చెల్లించుకుంటుంది. గత రెండు మ్యాచ్ల్లోనూ ఇదే జరిగింది. పరిస్థితులకు తగ్గట్లే ఆడే ప్రయత్నం సన్రైజర్స్ చేయలేకపోతుంది. కేకేఆర్తో మ్యాచ్ గెలవాలంటే సన్రైజర్స్ తమ అప్రోచ్ను మార్చుకోవాలి. ప్రతీసారి 300 పరుగులే లక్ష్యంగా ఆడితే కుదురదు.
ఆ ముగ్గురిపై వేటు..
అయితే టీమ్కాంబినేషన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మార్పులు చేసే అవకాశం ఉంది. తొలి మూడు మ్యాచ్ల్లో విఫలమైన అభినవ్ మనోహర్పై వేటు వేయనున్నారు. అతని స్థానంలో సచిన్ బేబీ లేదా అథర్వ టైడ్ను ఆడించవచ్చు. గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన వియాన్ మల్డర్ను కూడా తప్పించనున్నారు. ఆడమ్ జంపాను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోనున్నారు. బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. గత మ్యాచ్లో జీషన్ అన్సారీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కాబట్టి అతను తుది జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. పేస్ విభాగంలో కూడా మార్పులు జరగనున్నాయి. హర్షల్ పటేల్ స్థానంలో జయదేవ్ ఉనాద్కత్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు.
ట్రావిషేక్ చెలరేగితేనే..
బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్లతో పాటు అనికేత్ వర్మ చెలరేగితే సన్రైజర్స్ హైదరాబాద్కు తిరగుండదు. గత మ్యాచ్లో యువప్లేయర్ అనికేత్ వర్మ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. భారీ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. కానీ అతనికి మరో ఎండ్లో సహకారం లభించలేదు. బౌలింగ్ విభాగంలో షమీ, ప్యాట్ కమిన్స్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. ముఖ్యంగా షమీ వైఫల్యం ఆరెంజ్ ఆర్మీని ఆందోళనకు గురిచేస్తోంది.
కేకేఆర్తో సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్/సచిన్ బేబీ/అథర్వ టైడ్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్/జయదేవ్ ఉనాద్కత్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ
ఇంపాక్ట్ ప్లేయర్: ఆడమ్ జంపా/ కామిందు మెండీస్.