కోల్కతా: ఐపీఎల్ 2023 సీజన్లో రెండు వరుస పరాజయాలతో చతికిలపడిన సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. సోమవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. తమ కంటే బలహీనంగా ఉన్న ఢిల్లీపై గెలుపొంది మళ్లీ విజయాల బాట పట్టాలని మార్క్రమ్ సేన భావిస్తోంది.
మరోవైపు వరుసగా 5 ఓటముల తర్వాత ముక్కుతూ మూలుగుతూ విజయాన్నందుకున్న ఢిల్లీ అదే జోరును కొనసాగించాలనుకుంటోంది. దాంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. మరో థ్రిల్లింగ్ మ్యాచ్కు ఉప్పల్ వేదికకానుంది.

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును బ్యాటింగ్ వైఫల్యం వేధిస్తోంది. బిగ్ ప్రైజ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగినా.. ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్తో పాటు హెన్రీచ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్ కూడా విఫలమవుతుండటం జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. ఈ క్రమంలోనే తుది జట్టులో మార్పు చేసేందుకు సన్రైజర్స్ మేనేజ్మెంట్ సిద్దమైంది.
వరుసగా విఫలమవుతున్న రూ.8.25 కోట్ల ఆటగాడు మయాంక్ అగర్వాల్పై వేటే వేసి సౌరాష్ట్రకు చెందిన సమర్థ్ వ్యాస్కు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. మిడిలార్డర్ బ్యాటర్ అయిన వ్యాస్ దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గ్లేన్ ఫిలిప్స్ను కూడా జట్టులోకి తీసుకొచ్చి బ్యాటింగ్ బలోపేతం చేయాలనుకుంటుంది. అయితే పిచ్ కండిషన్స్ బట్టి నిర్ణయం తీసుకోనుంది.
పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటే నలుగురు ఓవర్సీస్ బ్యాటర్లు మార్క్రమ్, క్లాసెన్, ఫిలిప్స్, హ్యారీ బ్రూక్తో బరిలోకి దిగనుంది. స్లో పిచ్ అయితే మాత్రం మార్కో జాన్సెన్, ఆదిల్ రషీద్లలో ఒకరు ఆడనున్నారు. హ్యారీ బ్రూక్కు ఇదే చివరి అవకాశం కానుంది. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, మాయంక్ మార్కండే రాణిస్తుండగా ఇతర బౌలర్లు విఫలమవుతున్నారు. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్, బౌలింగ్లోనూ ప్రభావం చూపడం లేదు. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్లో ఒకరు బరిలోకి దిగనున్నారు.
ఢిల్లీతో సన్రైజర్స్ హైదరబాద్ తుది జట్టు(అంచనా)
హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, మయాంక్ అగర్వాల్/సమర్థ్ వ్యాస్, హెన్రీచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, మాయంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్: అబ్దుల్ సమద్/ వాషింగ్టన్ సుందర్