ఐపీఎల్ 2025 సీజన్కు రంగం సిద్దమైంది. మరో రెండు రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది. ఆదివారం ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్తో సన్రైజర్స్ హైదరాబాద్ తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది. గతేడాది తృటిలో టైటిల్ చేజార్చుకొని రన్నరప్గా నిలిచిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంతో టీమ్ బలహీనతలను అధిగమించిన సన్రైజర్స్.. పేపర్పై భీకరంగా కనిపిస్తోంది.
ఇప్పటికే జట్టు ఆటగాళ్లంతా హైదరాబాద్ చేరి ముమ్మరంగా సాధన చేస్తున్నారు. తొలి మ్యాచ్ నుంచే సన్రైజర్స్ హైదరాబాద్ తమ అత్యుత్తమ జట్టును బరిలోకి దించనుంది. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వేలానికి ముందే కోర్ టీమ్ సభ్యులను రిటైన్ చేసుకోవడం ఆరెంజ్ ఆర్మీకి కలిసొచ్చే అంశం.

ఓపెనర్లుగా అభిషేక్, ట్రావిస్ హెడ్..
వేలానికి ముందే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లను సన్రైజర్స్ రిటైన్ చేసుకుంది. గత సీజన్లో ఈ ఇద్దరూ పరుగుల విధ్వంసం సృష్టించారు. జట్టుకు అదిరిపోయే ఆరంభాలను అందించారు. ఈ క్రమంలోనే ఈ జోడీనే మరోసారి సన్రైజర్స్ ఇన్నింగ్స్ను ప్రారంభించనుంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. జట్టులోకి కొత్తగా వచ్చిన ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్లో ఆడనున్నాడు. అయితే టాప్-3 బ్యాటర్లు లెఫ్టాండర్సే కావడం సన్రైజర్స్ను ఆందోళనకు గురి చేస్తోంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ఆలోచిస్తే టాప్-3 బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయవచ్చు.
మిడిలార్డర్లో నితీష్, క్లాసెన్, అభినవ్ మనోహర్
మిడిలార్డర్లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డితో పాటు హెన్రీచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్ బరిలోకి దిగనున్నారు. గతేడాది నితీష్, క్లాసెన్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. అభినవ్ మనోహర్ కూడా చెలరేగితే సన్రైజర్స్ హైదరాబాద్కు తిరుగుండదు. అభినవ్ మనోహర్కు ఫినిషర్గా గుర్తింపు ఉంది.
ఆడమ్ జంపాకు నో ఛాన్స్..
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అభినవ్ మనోహర్లు స్పిన్ బౌలింగ్ చేయగలరు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రాహుల్ చాహర్ బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్ డెప్త్ కోసం పేస్ ఆల్రౌండర్ అయిన వియాన్ మల్డర్ను ఆడించే అవకాశం ఉంది. ఉప్పల్ మైదానం బ్యాటింగ్కు అనుకూలంగా ఉండనున్ననేపథ్యంలో సన్రైజర్స్ బ్యాటింగ్ ఆల్రౌండర్లకు ప్రాధాన్యత ఇవ్వనుంది. స్పిన్నర్ కావాలని భావిస్తే వియాన్ మల్డర్ స్థానంలో ఆడమ్ జంపా బరిలోకి దిగుతాడు.
పేసర్లుగా షమీ, కమిన్స్, హర్షల్ పటేల్
సన్రైజర్స్ హైదరాబాద్ పేస్ విభాగాన్ని ప్యాట్ కమిన్స్తో పాటు మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ నడిపించనున్నారు. ఈ ముగ్గురికి నితీష్ కుమార్ రెడ్డి అండగా నిలవనున్నాడు. వియాన్ మల్డర్ బరిలోకి దిగితే అతను కూడా పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. షమీ ఫిట్నెస్పై సందేహాలున్నాయి. బౌలింగ్లో కమిన్స్తో పాటు షమీ రాణిస్తే ఆరెంజ్ ఆర్మీకి తిరుగుండదు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రాహుల్ చాహర్ ఆడనున్నాడు. అయితే సన్రైజర్స్ జట్టులో 11 మంది బ్యాటర్లకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటం కలిసొచ్చే అంశం. ఇంపాక్ట్ ప్లేయర్లుగా సమర్జిత్ సింగ్, సచిన్ బేబీలు ఆడనున్నారు.
రాజస్థాన్ రాయల్స్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా):
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, వియాన్ మల్డర్/ఆడమ్ జంపా, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: సమర్జిత్ సింగ్, సచిన్ బేబీ