దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కుమార్తె కీర్తి, ప్రముఖ వ్యాపారవేత్త మహేష్ రెడ్డి కుమారుడు నితేష్ వివాహ రిసెప్షన్కు సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు హాజరయ్యారు. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరిగిన ఈ వేడుకకు సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, అభినవ్ మనోహర్లు హాజరవ్వడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన కొత్త ప్రభాకర్ రెడ్డికి సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లతో సత్సంబంధాలు ఉండటం ఏంటని నెటిజన్లు షాకవుతున్నారు. పెళ్లి కుమారుడైన నితేష్ తరఫున రిసెప్షన్కు వచ్చారా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. సన్రైజర్స్ ఆటగాళ్లు నేరుగా వెళ్లి నితేష్తో మాట్లాడారు. వారికి ముందే పరిచయం ఉన్నట్లు వీడియోను చూస్తే అర్థమవుతోంది. అయితే రిసెప్షన్కు గ్రాండ్ లుక్ తీసుకురావడానికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఓ ఎమ్మెల్యే కూతురు రిసెప్షన్కు స్టార్ ఆటగాళ్లు హాజరవ్వడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ వివాహ రిసెప్షన్కు పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్యే ఎన్. ఏ.హరీష్ తదితరులు సైతం హాజరయ్యారు.
ఐపీఎల్ 2025 సీజన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ ప్రధాన ఆటగాళ్లంతా నగరానికి చేరుకున్నారు. సన్రైజర్స్ ప్రాక్టీస్ క్యాంప్లో ముమ్మరంగా సాధన చేస్తున్నారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు ట్రావిస్ హెడ్, పలువురు ఓవర్సీస్ ఆటగాళ్లు రావాల్సి ఉంది. దేశవాళీ స్టార్ ఆటగాళ్లంతా ఇప్పటికే నగరానికి చేరుకొని ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్కు మార్చి 22న తెరలేవనుండగా.. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్తో ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్తో సన్రైజర్స్ తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది.