ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా వ్యవహరించింది. దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఈ వేలంలో రూ. 34 కోట్ల ప్రైజ్మనీతో బరిలోకి దిగిన సన్రైజర్స్ జట్టు బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేసింది. హెడ్ కోచ్ డానియల్ వెటోరి, స్పిన్ కోచ్ ముత్తయ్య మురళీ ధరణ్, టీమ్ ఓనర్ కావ్య మారన్తో కూడిన సన్రైజర్స్ ఆక్షన్ టీమ్.. వేలంలో దూకుడు కనబర్చింది.
ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను రూ. 20.50 కోట్ల రికార్డు ధర పెట్టి కొనుగోలు చేసింది. ప్రపంచకప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్ను రూ. 6.80 కోట్లకే దక్కించుకుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్.. మాజీ నెంబర్ వన్ టీ20 బౌలర్ వానిందు హసరంగాను కోటిన్నరకే సొంతం చేసుకుంది.

జయదేవ్ ఉనాద్కత్ను రూ. 160 లక్షలకు తీసుకున్న సన్రైజర్స్.. ఇద్దరి అనామక ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. ఆకాశ్ సింగ్తో పాటు జాథవెద్ సబ్రమణ్యన్లను వారి కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి తెలుగు ఆటగాళ్లకు మొండి చెయ్యి చూపించింది. కనీస ధరకు తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు.
అయితే విదేశీ ఆటగాళ్లనే తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్లో ఉన్న ఓవర్సీస్ ఆటగాళ్లంతా స్టార్ ప్లేయర్లేనని, తుది జట్టులో నలుగురికి మాత్రమే అవకాశం ఉన్నప్పుడు.. భారీ ధర పెట్టి వీరిని కొనుగోలు చేయాల్సిన అవసరం ఏం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్యాట్ కమిన్స్ను జట్టు కెప్టెన్గా ప్రకటించే అవకాశం ఉంది.
1. సన్రైజర్స్ హైదరాబాద్ ఆక్షన్ ప్లేయర్లు..
ట్రావిస్ హెడ్- రూ. 6.80 కోట్లు
వానిందు హసరంగా- రూ. 1.5 కోట్లు
ప్యాట్ కమిన్స్- రూ. 20.50 కోటలు
జయదేవ్ ఉనాద్కత్-రూ. 1.60 కోట్లు
ఆకాశ్ సింగ్- రూ. 20 లక్షలు
జాథవెద్ సుబ్రమణ్యన్- రూ. 20 లక్షలు

సన్రైజర్స్ హైదరాబాద్ రిటైన్డ్ లిస్ట్:
అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, హెన్రీచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, షెహ్బాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫజలక్ ఫరూఖీ.