3డీగాడు ఎందుకురా?
గత రెండు మ్యాచ్ల్లో బౌలింగ్, బ్యాటింగ్లో దారుణమైన విజయ్ శంకర్కు ఈ మ్యాచ్లో అవకాశం దక్కదని అంతా భావించారు. కానీ తీరా తుది జట్టులో అతని పేరు ఉండటంతో సన్రైజర్స్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో ట్విటర్ వేదికగా టీమ్మేనేజ్మెంట్ మండిపడుతున్నారు. ఫన్నీ మీమ్స్, కామెంట్స్తో ట్రోల్ చేస్తున్నారు. 3డీ అన్నా ఉన్నాడురోయ్ అని ఒకరంటే... ఆ శంకర్ గాడు ఎందుకురా? అని ఇంకొకరు కామెంట్ చేశారు. అసలు ఈ శంకర్ గాడికి ఎన్ని అవకాశాలు ఇస్తార్రా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టీమ్తో ముంబై ఓడించడం కష్టమని అభిప్రాయపడుతున్నారు.
ఎవడ్రా బ్యాటింగ్ చేసేది..?
గత మ్యాచ్లో బలహీనమైన మిడిలార్డ్ వల్ల ఓడిపోయామని, కానీ ఈ మ్యాచ్లో మిడిలార్డరే లేదని ఓ నెటిజన్ సెటైరికల్గా కామెంట్ చేశాడు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో ఔటైతే ఎవడ్రా బ్యాటింగ్ చేసేదని మరొకరు ప్రశ్నించారు. అసలు ఎవడ్రా టీమ్కు ఇలాంటి చెత్త సలహాలు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హోల్డర్ను తప్పించి కూడా పెద్ద తప్పిదం చేశారని ఒకరంటే.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ తీసుకొచ్చి మంచి పనిచేశారని మరికొందరు అంటున్నారు. అయితే ముంబై లెఫ్టార్మ్ బ్యాట్స్మెన్ ఎక్కువని, నబీని తీసుకొచ్చుంటే ఫలితం ఉండేదని మరొకరు కామెంట్ చేశారు.
నటరాజన్ను ఎందుకు?
ఇక యార్కర్ల కింగ్, సన్రైజర్స్ సెన్సేషన్ నటరాజన్ను పక్కనపెట్టడం కూడా అందర్నీ విస్మయపరిచింది. అసలు నటరాజన్ ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పైగా అతని స్థానంలో ఖలీల్ అహ్మద్ను తీసుకొచ్చి ఘోర తప్పిదం చేశారని మండిపడుతున్నారు. ఖలీల్ పరుగులు బాగా ఇస్తాడని, నట్టూ స్థానాన్ని భర్తీ చేయలేడని అభిప్రాయపడుతున్నారు. నట్టూలాగా యార్కర్లు మరెవరూ జట్టులో వేయలేరని కామెంట్ చేస్తున్నారు.
3డీ ప్లేయరంటూ..
2019లో జరిగిన వన్డే ప్రపంచకప్లో తెలుగు తేజం అంబటి రాయుడిని కాదని ఎమ్మెస్కే ప్రసాధ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ విజయ్ శంకర్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్.. త్రీ డైమన్షన్ నేపథ్యంలోనే అతని ఎంపిక చేశామని అప్పట్లో ఎమ్మెస్కే వివరణ ఇచ్చుకున్నాడు. దీనిపై రాయుడు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిచండంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగింది. ఆ ప్రపంచకప్లో విజయ్ శంకర్ గాయంతో మధ్యలోనే తప్పుకోవడం.. నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేక భారత్ ఇంటిదారి పట్టడం జరిగిపోయింది. దాంతో రాయుడుని ఎందుకుతీసుకోలేదని ఎమ్మెస్కేతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానులు ట్రోల్ చేశారు. తాజాగా విజయ్ శంకర్ వైఫల్యంతో మరోసారి ఎమ్మెస్కేపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో క్లిష్ట సమయంలో శంకర్ బాధ్యతారహితంగా ఔటై ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు.


Click it and Unblock the Notifications












