టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 12 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం సంతోషంగా ఉందని సోషల్ మీడియా వేదికగా శనివారం ఓ వీడియోను పంచుకున్నాడు. క్రికెటర్గా ఎదిగేందుకు అవకాశం ఇచ్చిన డీడీసీఏతో పాటు బీసీసీఐ, అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్కు సహచర క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు, అభిమానులు విషేస్ తెలియజేస్తున్నారు. భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షిస్తూ పోస్ట్లు పెడుతున్నారు. ఢిల్లీకి చెందిన శిఖర్ ధావన్కు హైదరాబాద్కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్లో హైదరాబాద్కు చెందిన డెక్కన్ ఛార్చర్స్, సన్రైజర్స్ హైదరాబాద్లకు శిఖర్ ధావన్ ప్రాతినిథ్యం వహించాడు. 2011 నుంచి 2018 వరకు గబ్బర్ హైదరాబాద్ బేస్డ్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు.

2011, 2012 సీజన్లలో డెక్కన్ ఛార్జర్స్కు ఆడిన ధావన్.. 2013లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత డారెన్ సామీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో స్టార్ ఓపెనర్గా కొనసాగాడు. 2016 సీజన్లో కెప్టెన్ డేవిడ్ వార్నర్తో కలిసి శిఖర్ ధావన్ అద్భుతమైన ఆరంభాలు అందించాడు. ముఖ్యంగా జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో 17 మ్యాచ్ల్లో నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 501 పరుగులు చేశాడు.
2018లో మళ్లీ సన్రైజర్స్ రిటైన్ చేసుకుంది. అయితే 2019లో అతని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేయడంతో సన్రైజర్స్ హైదరాబాద్తో ఉన్న బంధానికి తెరపడింది. ఐపీఎల్లో ఇప్పటి వరకు 222 మ్యాచ్లు ఆడిన శిఖర్ ధావన్.. 6768 పరుగులతో సెకండ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్లో ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడిన ధావన్.. చివరి మ్యాచ్ను సన్రైజర్స్ హైదరాబాద్తో ఆడాడు.
2010లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్తో గబ్బర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లో డకౌట్ అయిన అతను.. మళ్లీ 2011లో రీఎంట్రీ ఇచ్చాడు. 2013లో రెగ్యులర్ ఓపెనర్గా అవకాశాన్ని ఖాయం చేసుకున్నాడు. 2010-2022 వరకు భారత్ తరఫున శిఖర్ ధావన్ 167 వన్డేలు, 34 టెస్ట్లు, 68 టీ20లు ఆడాడు. వన్డేల్లో 6793, టెస్ట్ల్లో 2315 పరుగులు చేశాడు.
టీ20ల్లో 1759 రన్స్ చేసిన గబ్బర్.. వన్డేల్లో 17, టెస్ట్ల్లో 7 సెంచరీలు నమోదు చేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2015 వన్డే ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ 2018లో శిఖర్ ధావన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో శిఖర్ ధావన్కు మెరుగైన రికార్డు ఉంది. 2019 వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో విరిగిన బొటన వేలితో శతకం సాధించాడు. రోహిత్ శర్మతో కలిసి వన్డేల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డును కూడా అందుకున్నాడు. ఈ ఇద్దరూ 115 ఇన్నింగ్స్ల్లో 5148 పరుగులు చేశారు.