ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజేతగా నిలుస్తుందని సన్రైజర్స్ హైదరాబాద్ లేడీ ఫ్యాన్స్ జోస్యం చెప్పారు. సన్రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి వచ్చిన అభిమానులతో మా వన్ ఇండియా ప్రతినిధి మాట్లాడగా.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాజా మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలుస్తుందని, 250-300 పరుగులు చేస్తుందని అంచనా వేసారు.
సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరుతుందని చెప్పిన సదరు లేడీ ఫ్యాన్స్.. టైటిల్ మాత్రం ఆర్సీబీనే గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఈ సారి ఆర్సీబీదే టైటిల్ అని విరాట్ కోహ్లీపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మరో ఫ్యాన్ మాట్లాడుతూ.. సన్రైజర్స్ 300 స్కోర్ నమోదు చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇతర ఫ్రాంచైజీల అభిమానుల కూడా ఆర్సీబీ టైటిల్ గెలవాలని కోరుకుంటున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ అంచనాలకు భిన్నంగా ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సాధారణ ఉప్పల్ వికెట్కు భిన్నంగా ఉన్న స్లో వికెట్పై పరుగులు చేయలేక ఆరెంజ్ ఆర్మీ మరో ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది.
నితీష్ కుమార్ రెడ్డి(34 బంతుల్లో 3 ఫోర్లతో 31), హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. ప్యాట్ కమిన్స్(9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/17) నాలుగు వికెట్లతో సన్రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్మన్ గిల్(43 బంతుల్లో 9 ఫోర్లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 49), షెర్ఫేన్ రూథర్ఫోర్డ్(16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సన్రైజర్స్ బౌలర్లలో మహమ్మద్ షమీ(2/28) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు. సన్రైజర్స్ హైదరాబాద్కు వరుసగా ఇది నాలుగో పరాజయం కావడం గమనార్హం.