క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుంచి మే 25 వరకు మొత్తం 65 రోజుల పాటు జరిగే 74 మ్యాచ్ల వివరాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శనివారం ప్రకటించింది. ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
ఉప్పల్లో 9 మ్యాచ్లు..
ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం.. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా మొత్తం 9 మ్యాచ్లు జరగనున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్లో ఆ జట్టు ఏడు లీగ్ మ్యాచ్లు ఆడనుంది. గతేడాది సన్రైజర్స్ హైదరాబాద్ రన్నరప్గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో ఉప్పల్ వేదికగా క్వాలిఫయర్-1తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్లు కేటాయించారు. ఈ క్రమంలోనే ఉప్పల్ వేదికగా మొత్తం 9 మ్యాచ్లు జరగనున్నాయి.

నిరాశలో SRH ఫ్యాన్స్..
ఉప్పల్ వేదికగా 9 మ్యాచ్లు జరగనున్నా సన్రైజర్స్ అభిమానులు నిరాశలో ఉన్నారు. ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్తో ఉప్పల్ వేదికగా ఒక్క మ్యాచ్ లేకపోవడమే ఇందుకు కారణం. తమ అభిమాన ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోవడంతో ఆవేదనకు గురవుతున్నారు. అయితే ముంబై ఇండియన్స్తో ఏప్రిల్ 23న మ్యాచ్ ఉండటం కాస్త ఊరటనిస్తోంది. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లకు ఆ జట్లు అర్హత సాధిస్తేనే వారిని చూసే అవకాశం హైదరాబాద్ అభిమానులకు దక్కనుంది.
ఐపీఎల్ 2025 సీడింగ్ గ్రూప్స్లో సన్రైజర్స్ హైదరాబాద్ గ్రూప్-బీలో ఉంది. ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్తో రెండేసి మ్యాచ్లు ఆడనుంది. గ్రూప్-ఏలో ఉన్న కేకేఆర్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, సీఎస్కే, పంజాబ్ కింగ్స్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఆర్సీబీ, సీఎస్కేలతో ఆయా జట్ల హోమ్ గ్రౌండ్స్లో తలపడనుంది. దాంతోనే ఆ జట్లతో ఉప్పల్ వేదికగా మ్యాచ్లు లేవు.