ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సన్రైజర్స్ హైదరాబాద్(SRH) స్పిన్నర్ జీషన్ అన్సారీ దుమ్మురేపుతున్నాడు. ఈ టోర్నీలో ఉత్తరప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న జీషన్ అన్సారీ.. వరుసగా రెండు మ్యాచ్ల్లో నాలుగేసి వికెట్లతో మొత్తం 8 వికెట్ల పడగొట్టాడు. అతని సంచలన బౌలింగ్ ప్రదర్శనతో యూపీ వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది.
చండీగఢ్తో శుక్రవారం రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో యూపీ 227 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 367 పరుగులు చేసింది. రింకు సింగ్(60 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 106) భారీ శతకంతో చెలరేగగా.. ధ్రువ్ జురెల్(67) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం చండీగఢ్ 29.3 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. జీషన్ అన్సారీ(4/29) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.

హైదరాబాద్తో జరిగిన తొలి మ్యాచ్లోనూ జీషన్స్ అన్సారీ(4/31) నాలుగు వికెట్లతో యూపీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో యూపీ 324/5 స్కోర్ చేయగా.. హైదరాబాద్ 240 పరుగులకే ఆలౌటైంది. జీషన్ అన్సారీ సంచలన ప్రదర్శన నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లో హైదరాబాద్ తరఫున 10 మ్యాచ్లు ఆడిన జీషన్ అన్సారీ 6 వికెట్లు మాత్రమే తీసాడు. ఇందులో ఒకే మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టాడు. అతని వైఫల్యం ఆరెంజ్ ఆర్మీ విజయవకాశాలను దెబ్బతీసింది. అయినా అన్సారీపై నమ్మకం ఉంచిన సన్రైజర్స్ అతన్ని రిటైన్ చేసుకుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెడుతూ జీషన్ అన్సారీ దేశవాళీ క్రికెట్లో చెలరేగుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి దూరంగా ఉన్న అన్సారీ.. విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. జీషన్ అన్సారీ ప్రదర్శనకు సన్రైజర్స్ కూడా ఫిదా అయ్యింది. అతని ప్రదర్శనను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెట్టింది. అన్సారీ సూపర్ ఫామ్పై సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు.. ఐపీఎల్ 2026లో ఇక గత్తరలేపుడేనని కామెంట్ చేస్తున్నారు.